‘అందుకోసం ఏ పార్టీతో అయినా చేతులు కలుపుతాం’

18 Dec, 2018 11:16 IST|Sakshi

శ్రీనగర్‌ : పాకిస్తాన్‌తో మాట్లాడానికి ఇదే సరైన సమయం​ అంటున్నారు జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ. ‘ప్రస్తుతం పాకిస్తాన్‌ నూతన ప్రధాన మంత్రిగా ఎన్నికైన ఇమ్రాన్‌ ఖాన్‌ తనను తాను తన దేశ ఆర్మి ప్రతినిధిగా చెప్పుకుంటున్నారు. చర్యలకు సిద్ధం అంటున్నారు. కాబట్టి పాక్‌తో చర్చలు జరపడానికి ఇదే మంచి సమయం. ఇప్పుడు చర్చలు జరిపితే మంచి ఫలితం ఉంటుంద’ని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌ అంశం గురించి మాట్లాడటానికి కూడా ఇదే మంచి సమయం అన్నారు.

అంతేకాక కశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం ఏ రాజకీయ పార్టీతోనైనా చేతులు కలపడానికి తమ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు ముఫ్తీ. అది బీజేపీ పార్టీ అయినా సరే.. కశ్మీర్‌ సమస్య పరిష్కారం కావడమే ముఖ్యం అన్నారు. అందుకోసమే గతంలో పీడీపీ, బీజేపీతో చేతులు కలిపిందని గుర్తు చేశారు. కానీ ఈ ప్రయోగం సక్సెస్‌ అవ్వలేదని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌ ప్రజలు కూడా దీన్ని ఆమోదించలేదన్నారు. అంతేకాక మాజీ భారత ప్రధాని వాజ్‌పేయికి.. నేటి ప్రధాని నరేంద్రమోదీకి మధ్య చాలా తేడా ఉందన్నారు. అటల్‌జీ ఒక రాజనీతిజ్ఞుడు.. చాలా గొప్పవారు.. వెనకడుగు వేయని ధీశాలి. కానీ నేటీ ఎన్డీఏ నాయకులకు ఎన్నికల్లో విజయం సాధించడం గురించి తప్ప మరో ఆలోచన లేదంటూ విమర్శించారు. ఆవుల సంరక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న మూక దాడులను ఉద్దేశిస్తూ.. ఇంకా నయం ఆవులకు ఓటు హక్కు ఇవ్వలేదంటూ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు