స్వచ్ఛభారత్‌ అంటే ఇదేనా..!

24 Aug, 2019 15:58 IST|Sakshi

బెంగళూరు: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమారావుకు చేదు అనుభవం ఎదురైంది. బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని లాంజ్‌లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్‌ వల్ల ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో అపరిశుభ్ర టాయిలెట్‌ ఫోటోలు తీసి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. వీటిని బెంగుళూరు విమానాశ్రయ అధికారిక ట్విటర్‌ ఖాతాకు నిరుపమ ట్యాగ్‌ చేశారు. దీంతోపాటు ‘విరిగిన పోయిన టాయిలెట్‌ టబ్‌, నిండినపోయిన చెత్త క్యాన్‌లు ఉన్నాయి. ఇదేనా ‘స్వచ్ఛ భారత్‌’ అంటే.. ‘స్వచ్ఛ భారత్‌’ ఎక్కడ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఇలా ఉండటం బాధాకరం’  అంటూ కామెంట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో నిరుపమ షేర్‌ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు ఎయిర్‌ పోర్టు అధికారులు నిరుపమకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సత్వరమే టాయిలెట్‌ను బాగు చేసి మళ్లీ తమ ట్విటర్‌లో ఆ ఫోటోలను పోస్ట్‌ చేశారు. ఎయిర్‌పోర్టు ఆధికారులు స్పదించిన తీరుకు నిరుపమ సంతోషించారు. ఈ క్రమంలో త్వరగా స్పందించి.. ఎయిర్‌ పోర్టు అధికారులు నిరుపమ మనసును గెలుచుకున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు