‘బీజేపీ, అన్నాడీఎంకేలను గద్దెదించుతాం’

21 Mar, 2019 15:48 IST|Sakshi
వి.పి. కళైరాజన్‌కు పుష్పగుచ్ఛంతో పార్టీలోకి ఆహ్వానిస్లున్న డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌

చెన్నై: కేంద్రంలో బీజేపీని మళ్లీ గద్దెనెక్కకుండా చేయడం, రాష్ట్రంలో అన్నాడీఎంకేను ఓడించడమే తమ లక్ష్యమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌  గురువారం మీడియాకు తెలిపారు. టీటీవీ దినకరన్‌ ఆధ్వర్యంలో అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) దక్షిణ చెన్నై సెక్రెటరీగా వ్యవహరిస్తున్న వీపీ కళైరాజన్‌ ఈ రోజు మధ్యాహ్నం డీఎంకేలో చేరారు.

తిరుచ్చిలో జరిగిన ఒక సభలో  కళైరాజన్‌ను పార్టీలోకి ఆహ్వానించిన స్టాలిన్‌ మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకే ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏఎంఎంకేతోపాటు వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. బీజేపీ,  అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం తమతోనే సాధ్యమని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన కళైరాజన్‌ మాట్లాడుతూ ‘తమిళనాడును  కాపాడే సత్తా, ద్రవిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తెగువ స్టాలిన్‌కే ఉన్నాయన్నారు. కళైరాజన్‌ను ఏఎంఎంకే నుంచి దినకరన్‌  బుధవారం బహిష్కరించారు. వీ సెంథిల్‌ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రెండో నేత కళైరాజన్‌.        

మరిన్ని వార్తలు