మూక హత్యల నిరోధంపై నివేదిక

30 Aug, 2018 08:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న మూక హత్యల నిరోధానికి నూతన చట్టం తీసుకువచ్చే ప్రతిపాదనపై హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గుబ నేతృత్వంలోని కమిటీ మంత్రుల బృందానికి నివేదిక సమర్పించింది. సోషల్‌ మీడియా వేదికలపై విద్వేష ప్రచారం, వదంతులు వ్యాప్తి చేయడాన్ని నివారించేందుకూ ఈ కమిటీ పలు మార్గదర్శకాలు జారీచేసింది. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సారథ్యంలోని మంత్రుల బృందం కమిటీ సూచించిన మార్గదర్శకాలను పరిశీలిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

కాగా ఈ కమిటీ పలు సోషల్‌ మీడియా వేదికల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, అభ్యంతరకర కంటెంట్‌పై ప్రజలు ఫిర్యాదులు నమోదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. కంటెంట్‌ పర్యవేక్షణ, సైబర్‌ పోలీసింగ్‌కు ప్రత్యేక చర్యలు అవసరమని స్పష్టం చేసింది.

మూక హత్యలను నివారించేందుకు నూతన చట్టం తీసుకువచ్చే ప్రతిపాదన పరిశీలించాలని సుప్రీం కోర్టు ఇటీవల పార్లమెంట్‌ను కోరిన క్రమంలో ఈ అంశంపై మంత్రుల బృందం, కార్యదర్శుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ మార్గదర్శకాలను మంత్రుల బృందం పరిశీలించి తుదినిర్ణయం కోసం ప్రదాని నరేంద్ర మోదీకి తమ సిఫార్సులను నివేదిస్తుందని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు