మేమిద్దరం తిండిబోతులం

19 Jul, 2014 22:25 IST|Sakshi

 నిజజీవితంలోనూ తాను తిండిబోతునని నిజాయతీగా ఒప్పుకునే పరిణీతి చోప్రాకు సరిపోయే సినిమానే దొరికింది! ఆదిత్యరాయ్ కపూర్‌కు జోడీగా ఈమె దావత్ ఏ ఇష్క్‌లో నటిస్తోంది. ఇద్దరం తిండిబోతులం కాబట్టే షూటింగ్ సెట్లపైనే స్నేహితులమయ్యామని చెబుతోంది. హబీబ్ ఫైజల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పరిణీతి హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో సేల్స్‌గాళ్‌గా పనిచేసే గుల్రెజ్‌గా కనిపిస్తుంది. కెబాబ్‌లు, బిర్యానీతో ఎంతటి వారినైనా కట్టిపడేసే బావర్చీగా ఆదిత్య నటిస్తున్నాడు. చిన్న ఘర్షణ కారణంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
 
 ‘నేను తిండిబోతును. ఈ విషయంలో ఆది నాతో పోటీ పడతాడని షూటింగ్ సమయంలోనే అర్థమయింది. మా ఇద్దరికీ తిండి అంటే చాలా ఇష్టం. ప్లేట్లకు ప్లేట్లు సెట్లపైనే లాగించే వాళ్లం. ఈ సినిమాలో నేను బాగా తినాలి. దీని కథ నాకోసమే రాశారేమో అనిపించింది’ అని వివరించింది. దావత్ ఏ ఇష్క్ పాటల విడుదల కోసం ఢిల్లీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో పరిణీతి మాట్లాడుతూ ఈ సంగతులన్నీ చెప్పింది. హైదరాబాద్‌తోపాటు లక్నో, ముంబైలో సినిమా షూటింగ్ జరిగింది. లక్నో వంటకాల పుణ్యమాని ఆదిత్య, తాను విపరీతంగా బరువెక్కామంటూ ఈ 25 ఏళ్ల బ్యూటీ నవ్వేసింది. ‘మాతోపాటు అనుపమ్ ఖేర్  బాగా లాగించేవారు.
 
 ఆయన కొన్నాళ్లు లక్నోలోనూ ఉండడం వల్ల అక్కడి స్థానిక వంటకాలు, హోటళ్ల గురించి బాగా తెలుసు’ అని వివరించింది. 2012 హబీబ్ తీసిన ఇషక్‌జాదేలో పరిణీతి ముస్లిం యువతిగా కనిపించగా, ఈ సినిమాలోనూ ముస్లింగా నటించడం విశేషం. రెండు సినిమాల్లోనూ ముస్లింగా కనిపించినా, పాత్రలు మాత్రం వేర్వేరుగా ఉంటాయని తెలిపింది. దావత్ ఏ ఇష్క్‌లో ఈమె హైదరాబాద్ హిందీ మాట్లాడుతుందని దర్శకుడు హబీబ్ అన్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాను వచ్చే నెల ఐదు నుంచి థియేటర్లలో చూడవచ్చు. సాజిద్ వాజిత్ ద్వయం ఈ సినిమా కోసం బాణీలు అందించింది.
 

మరిన్ని వార్తలు