‘ఆమె 24 గంటల్లోనే ప్రతీకారం తీర్చుకున్నారు’

15 May, 2019 18:49 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటానని దీదీ చెప్పిన 24 గంటల్లోనే బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా రోడ్‌షోపై దాడి జరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారులు సైతం మమతా బెనర్జీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ మార్ఫింగ్‌ ఇమేజ్‌ను షేర్‌ చేసిన బీజేపీ కార్యకర్త అరెస్ట్‌ను ప్రధాని ప్రస్తావిస్తూ మీరు జైలులో పెడుతున్న కుమార్తెలు రేపు మిమ్మలి శిక్షిస్తారని అన్నారు.

ఒక ఫోటోపై ఇంత ఆగ్రహం వెలిబుచ్చుతారా అని ప్రశ్నించారు. అమర్యాదకరంగా తన ఫోటోను చిత్రీకరించి తీసుకువచ్చినా తానేమీ ఆగ్రహించనని, హుందాగా అంగీకరిస్తానని ప్రధాని చెప్పుకొచ్చారు. తన ఫోటోను అలా మార్చి తీసుకువస్తే మీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాదని కూడా తాను హామీ ఇస్తున్నానని అన్నారు. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌ ప్రజలు తృణమూల్‌ కాంగ్రెస్‌ను సమూలంగా తిరస్కరిస్తారని మోదీ జోస్యం చెప్పారు. బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారం చేపడుతుందని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. తమ పార్టీకి 300కి పైగా సీట్లు రావడంలో బెంగాల్‌ తోడ్పాటు ఉంటుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు