అలీఘర్ : ఉత్తర్ ప్రదేశ్లో మీడియా సాక్షిగా ఇద్దరు హంతకులను పోలీసులు హతమార్చడం సంచలనంగా మారింది. హర్దూగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచువా గ్రామంలో గురువారం నేరగాళ్లు సంచరిస్తున్నారన్న
సమాచారాన్ని స్థానిక పోలీసులు తెలుసుకున్నారు. బైక్పై వెళుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ముస్తకిమ్, నౌషద్లను అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ, పోలీసుల కళ్లుగప్పి సమీపంలోని ఓ పాత బిల్డింగ్లో వారు తలదాచుకున్నారు. పెద్దమొత్తంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకోవాడానికి ప్రయత్నించగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మరి కాసేపట్లో లైవ్ ఎన్కౌంటర్ ఉంది..మీడియా వచ్చి కవర్ చేయండి అంటూ పోలీసుల నుంచి మీడియాకు ఆహ్వానం వచ్చింది. స్థానిక, జాతీయ మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఎన్కౌంటర్ని చిత్రీకరించారు. ఎన్కౌంటర్ గురించి పారదర్శకంగా వ్యవహరించడానికే మీడియాకు ఆహ్వానించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్కౌంటర్లో ఇద్దరు క్రిమినల్స్ మృతిచెందగా, ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
నెల రోజుల వ్యవధిలోనే జరిగిన 6 హత్య కేసుల్లో ముస్తకిమ్, నౌషద్లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరికి 10కి పైగా దొంగతనం కేసుల్లో కూడా సంబంధం ఉండటంతో పోలీసులు ఒక్కొక్కరిపై రూ.25 వేల రివార్డు కూడా ప్రకటించారు.