భారీగా తగ్గిన ఏసీ కోచ్‌ టికెట్ల ధరలు

12 Aug, 2018 15:27 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : ప్రయాణీకులకు రైల్వేలు తీపికబురు అందించాయి. ఏసీ ట్రైన్లలో ఎక్కువ మంది ప్రయాణీకులను ఆకర్షించేలా ఐదు రైళ్లలో ఏసీ కోచ్‌ టికెట్‌ ధరలను రైల్వేలు ఇటీవల తగ్గించాయి. కర్నాటకలో బెంగళూర్‌, గడగ్‌, మైసూర్‌ నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఏసీ కోచ్‌ల ధరలను నైరుతి రైల్వే ప్రకటించింది. బెంగళూర్‌ మీదుగా మైసూర్‌, చెన్నై శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్‌ కార్‌ ధర తగ్గించడంతో బస్సు, విమానాల కన్నా అధికంగా ప్రయాణీకులు ఈ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ప్రయాణిస్తున్నారని నైరుతి రైల్వే ప్రతినిధి వెల్లడించారు.

శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో చార్జీల తగ్గింపుకు లభించిన స్పందనతో బెంగళూర్‌ నుంచి యశ్వంత్‌పూర్‌-హూబ్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ చైర్‌కార్‌ ధరలను రూ 735 నుంచి రూ 590కు తగ్గించామని తెలిపారు. గత వారం ఈ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ చార్జీలను తొలిసారిగా తగ్గించడంతో స్పందన ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. ఇక మైసూర్‌-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ చార్జీలను సైతం డిసెంబర్‌ 3 నుంచి రూ 495 నుంచి రూ 260కి తగ్గిస్తామని వెల్లడించారు.

బెంగళూర్‌, హుబ్లీ మధ్య నడిచే యశ్వంత్‌పూర్‌-బికనీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ చార్జీలను నవంబర్‌ 30 నుంచి రూ 735 నుంచి రూ 590కి తగ్గిస్తామన్నారు. ఇక యశ్వంత్‌పూర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ ఫేర్‌ను నవంబర్‌ 22 నుంచి రూ 345 నుంచి రూ 305కు తగ్గించనున్నట్టు చెప్పారు.  ప్రయాణీకులకు సుఖవంతమైన ప్రయాణం అందించేందుకు ఏసీ కోచ్‌లలో వులెన్‌ దుప్పట్ల స్ధానంలో మెరుగైన నాణ్యతతో కూడిన నైలాన్‌ బ్లాంకెట్స్‌ అందుబాటులోకి తేనున్నారు.

మరిన్ని వార్తలు