మానస సరోవర్‌ యాత్రికులకు గుడ్‌న్యూస్

8 May, 2020 16:08 IST|Sakshi

న్యూఢిల్లీ : కైలాష్ మానస సరోవర్ యాత్రికులకు గుడ్‌న్యూస్‌. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం ద్వారా కైలాష్ మానస సరోవర్ వెళ్లే వారు ఇక నుంచి 90 కిలో మీటర్ల పర్వతారోహణ ప్రయాణం తగ్గనుంది. ఉత్తరాఖండ్‌లోని ధార్‌చులా నుంచి చైనా బోర్డర్‌ అయిన లిపులేఖ్ పాస్‌లను కలిపే క్లిష్టమైన మార్గాన్ని బార్డర్‌ రోడ్స్ ఆర్గనైజేష‌న్ నిర్మించింది. ఈ మార్గాన్ని శుక్రవారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. పితోరగర్‌ నుంచి గంజికి(నూతనంగా నిర్మించిన మార్గం గుండా) వెళ్లే తొమ్మిది వాహనాల కాన్వాయ్‌ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పచ్చ జెండా ఊపి పంపారు. ఈ కార్యక్రమంలో ఛీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఛీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నార్వానే పాల్గొన్నారు. ఈ మార్గంతో 90కిలో మీట‌ర్ల మేర పర్వతారోహ‌ణను నివారించ‌డంతోపాటు వాహ‌నాల్లో చైనా స‌రిహ‌ద్దుల వ‌ర‌కు వెళ్లే అవ‌కాశ‌ముంటుంద‌ని బీఆర్వో ఉన్నతాధికారి ఒక‌రు వెల్లడించారు.

కైలాష్ మానస సరోవర్ టిబెట్‌లో ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జూన్ నెల నుండి సెప్టెంబర్ వరకు రెండు మార్గాల ద్వారా (సిక్కింలోని నాథులా పాస్ మార్గం, ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ మార్గం) ఈ యాత్రను నిర్వహిస్తుంది. ప్రతి ఏటా కైలాష్ మానస సరోవర్ యాత్రలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది యాత్రికులు వెళుతుంటారు.

మరిన్ని వార్తలు