‘పాక్‌ పాట పాడుతున్న కాంగ్రెస్‌ నేతలు’

8 Mar, 2019 19:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లో భారత్‌ చేపట్టిన వైమానిక దాడులపై సందేహాలు వ్యక్తం చేస్తున్న విపక్ష నేతలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం‍మాధవ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతల ప్రకటనలపై పాకిస్తాన్‌ అంతటా చర్చ జరుగుతోందని, పాక్‌ మీడియా సైతం పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతల ప్రకటనలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు.

ఉగ్రవాదంపై పాక్‌ వైఖరికి అనుకూలంగా, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదానికి సంబంధించి కాంగ్రెస్‌ నేతల తీరు పాకిస్తాన్‌ పోస్టర్‌ బాయ్స్‌లా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పాక్‌ తీరును సమర్ధించేలా దిగ్విజయ్‌ సింగ్‌, సిద్ధూ వంటి కాంగ్రెస్‌ నేతల ప్రకటనలున్నాయని ఆరోపించారు.

కాగా, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిక్షణా శిబిరం‍పై భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై పాలక, విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో రాంమాధవ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు