సీజేఐపై ఆరోపణలు : విచారణకు సుప్రీం కమిటీ

25 Apr, 2019 15:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న న్యాయవాది దాఖలు చేసిన అఫిడవిట్‌పై లోతైన విచారణకు సుప్రీం కోర్టు మొగ్గుచూపింది. సీజేఐపై ఆరోపణల వ్యవహారంపై విచారణకు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

మరోవైపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగోయ్‌కు వ్యతిరేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి,ఆయన ప్రతిష్టను మసకబార్చేందుకు సహకరించాలని తనకు రూ 1.5 కోట్లు ఆఫర్‌ చేశారని న్యాయవాది ఉత్సవ్‌ బైన్స్‌ తన అఫిడవిట్‌లో కోర్టుకు నివేదించారు.

పేరుప్రతిష్టలు, డబ్బు, హోదా కలిగిన వ్యక్తులు వ్యవస్ధను నడిపించాలని ప్రయత్నిస్తున్నారని, వీరి ఆటలు సాగవని మనం చాటిచెప్పాల్సిన అవసరం నెలకొందని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్‌ సీజేఐ రంజన్‌ గగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్వతం‍త్ర కమిటీని నియమిస్తూ స్పష్టం చేసింది. కాగా, ఈ విచారణ ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలపై చేపట్టిన అంతర్గత విచారణపై ప్రభావం చూపబోదని కోర్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు