బులంద్షహర్: ఉత్తరప్రదేశ్లో ఓ రాష్ట్రీయ్ లోక్దళ్ నాయకుడి సోదరుడి హత్య జరిగింది. ఆయనతోపాటు మరో వ్యక్తి కూడా హత్యకు గురయ్యాడు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న వారిద్దరిని పోలీసులు మంగళవారం గుర్తించారు. వినోద్ గౌతమ్ అనే వ్యక్తి ఆర్ఎల్డీ తరుపున ప్రస్తుతం యూపీ ఎన్నికల బరిలో ఉన్నాడు. అతడికి మనోజ్ గౌతమ్ అనే సోదరుడు ఉన్నాడు.
అతడికి సచిన్ అనే ఓ మిత్రుడు ఉన్నాడు. వీరిద్దరు నిన్నటి నుంచి కనిపించకుండా పోయారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గాలింపులు ప్రారంభించిన పోలీసులకు బులంద్ షహర్కు సమీపంలోని ఖుర్జా అనే ప్రాంతంలో బుల్లెట్ గాయాలతో విగతజీవులై కనిపించారు. అయితే, వీరిద్దరితోపాటు పార్టీ ఆఫీసు నుంచి పర్మిందర్ అనే వ్యక్తి కూడా బయలుదేరాడని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆ వ్యక్తి కనిపించకుండా పోయిన నేపథ్యంలో అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.