పట్టాలెక్కనున్న సెమీ హై స్పీడ్ రైలు

4 Apr, 2016 21:49 IST|Sakshi

న్యూ ఢిల్లీ: దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు.. గతిమాన్ ఎక్స్ప్రెస్ ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ఢిల్లీలో  ప్రారంభించనున్నారు. రైల్వే బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్ లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విమానాల్లో మాదిరిగానే సేవికలను నియమిస్తున్నామని, ఆహార పదార్థాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని తెలిపారు.

ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రాలోని కాంట్ స్టేషన్ల మధ్య ప్రయాణించనున్న ఈ గతిమాన్ ఎక్స్ప్రెస్ రైలు వారంలో ఆరురోజులు(శుక్రవారం తప్ప) ప్రయాణికులకు సేవలందించనుంది.

>
మరిన్ని వార్తలు