కత్తులు నూరుకున్న బాబాయ్ అబ్బాయ్

5 Nov, 2016 14:19 IST|Sakshi
కత్తులు నూరుకున్న బాబాయ్ అబ్బాయ్
ఉత్తర ప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో బాబాయ్ అబ్బాయ్‌ల మధ్య ఉన్న లుకలుకలు మరోసారి బహిరంగ వేదికపై బయటపడ్డాయి. పార్టీ రజతోత్సవాల వేదిక సాక్షిగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్ మాటల యుద్ధానికి దిగారు. తొలుత శివపాల్ యాదవ్ ప్రసంగించగా.. ఆ తర్వాత అఖిలేష్ మాట్లాడారు. తాను ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని, కావాలంటే రక్తం ధారపోస్తానని శివపాల్ అన్నారు. అయితే, కొంతమంది మాట వింటారు గానీ పార్టీ మొత్తం సర్వనాశనం అయిన తర్వాతే వింటారని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎవరూ పరీక్షలకు సిద్ధపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా తమంతట తాముగా పరీక్షకు వస్తానంటే మాత్రం.. తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ''మీరు నాకు కత్తిని బహుమతిగా ఇచ్చారు. కత్తి అంటూ ఇస్తే దాన్ని తిప్పి తీరుతా'' అని వ్యాఖ్యానించారు. 
 
వచ్చే సంవత్సరం యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అంతకుముందు చెప్పారు. మతవాద శక్తులు విజయం సాధించకుండా.. మనం మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతామని కార్యకర్తలతో అన్నారు. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) రక్తమాంసాలు ధారపోసి ఈ పార్టీ పెట్టారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఇప్పటికి చాలాదూరం వచ్చామని, ఇక పార్టీని మరో మెట్టు పైకి ఎక్కించాలని, మనమంతా కలిసి ఈ పని చేయాలని చెప్పారు. గత కొన్నేళ్లుగా రోడ్లనిర్మాణం, ఇతర అంశాల్లో చాలా రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు.
మరిన్ని వార్తలు