13 నుంచి శబరిమల కేసులో విచారణ

7 Jan, 2020 06:00 IST|Sakshi

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 13 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. శబరిమల అంశంతో పాటు ముస్లిం, పార్శీ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై కూడా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ.. ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. మసీదులు, దర్గాల్లోకి ముస్లిం మహిళలను అనుమతించకపోవడం.. పార్శీ మహిళలు పార్శీయేతర కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే వారిని అగ్యారీ అనే పవిత్ర స్థలంలోకి ప్రవేశించనీయకుండా నిషేధాజ్ఞలు విధించడం వంటి ఆంక్షలు దేశంలో ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి కూడా ధర్మాసనం విచారణ జరపనుంది.

>
మరిన్ని వార్తలు