పదోన్నతుల్లో రిజర్వేషన్లపై జాప్యాన్ని సహించం

12 May, 2016 00:58 IST|Sakshi

టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య

 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కడం లేదని, కేవలం 9 శాతం మాత్రమే బీసీ ఉద్యోగులు ఉన్నారని... ఇదెక్కడి ప్రజాస్వామ్యమని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిర్వహించిన బీసీ ఉద్యోగుల మహా ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు అధ్యక్షత జరిగిన ఈ ధర్నాకు ఎంపీలు కె.మునియప్ప, నంది ఎల్లయ్య, కె.చంద్రప్ప సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం ఉద్యోగుల శాతం లేకుంటే పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఏ వర్గానికి లేని రీతిలో బీసీలకు క్రీమిలేయర్‌ను రుద్దుతున్నారని విమర్శించారు. ధర్నాలో బీసీ నేతలు శ్రీనివాస్ గౌడ్, గుజ్జకృష్ణ, రుషిఅరుణ్, జి.మల్లేష్‌యాదవ్, రమేశ్ తదితరులు ప్రసంగించారు.

మరిన్ని వార్తలు