నవజోత్‌ సింగ్‌ సిద్ధును ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

24 May, 2019 11:06 IST|Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవి చూసింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథీలో ఓడి పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెటిజన్లు.. పంజాబ్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధుని తెగ ట్రోల్‌ చేస్తున్నారు. ‘సిద్ధు రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటావ్‌’ అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ‍ప్రచారంలో భాగంగా అమేథీలో స్మృతి ఇరానీ.. రాహుల్‌ గాంధీకి గట్టి పోటీ ఇస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలను సిద్ధు ఖండించారు. ‘అమేథీ కాంగ్రెస్‌ కంచుకోట. ఇక్కడ రాహుల్‌ గాంధీ ఓడిపోవడం అనే మాట కల. ఒకవేళ అదే జరిగితే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాన’ని సిద్ధు బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నిన్న వెల్లడించిన ఫలితాల్లో స్మృతి ఇరానీ.. 28 వేల మెజారిటీతో రాహుల్‌ గాంధీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెటిజన్లు ‘సిద్ధు రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటావ్‌’.. ‘రాజీనామ లెటర్‌ టైప్‌ చేయడం ప్రారంభించావా’.. ‘రాహుల్‌ ఓడిపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావ్‌.. ఇక బ్యాగ్‌ సర్దుకో.. ప్రపంచ కప్‌ వచ్చేస్తుందిగా.. నువ్వు బాగా మాట్లాడతావ్‌’.. ‘నువ్వు మాటల మనిషివని నాకు తెలుసు.. ఇక వెళ్లిపో’ అంటూ తెగ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు