అగస్టా కేసు: త్యాగికి బెయిల్‌

12 Sep, 2018 12:48 IST|Sakshi
ఎయిర్‌ఫోర్స్‌ మాజీ చీప్‌ ఎస్‌పీ త్యాగి (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌లాండ్‌ మనీ ల్యాండరింగ్‌ కేసులో వైమానిక దళ మాజీ చీఫ్‌ ఎస్‌పీ త్యాగి, ఆయన సోదరులకు పటియాలా హౌస్‌ కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. రూ లక్ష వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు కోరింది. రూ 3600 కోట్ల అగస్టా ఒప్పందంలో పలు అక్రమ మార్గాల్లో కాంట్రాక్టును పొందేందుకు కోట్ల మొత్తం చేతులు మారాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో దాఖలైన చార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం కోర్టు ఎదుట హాజరు కావాలని 30 మందికి పైగా నిందితులకు ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ సమన్లు జారీ చేశారు. కాగా అగస్టా స్కామ్‌తో సంబంధం ఉన్న విదేశీ సంస్థలు, వ్యక్తులు బుధవారం కోర్టు ఎదుట హాజరుకాలేదు.

భారత వైమానిక దళానికి 12 ఏడబ్ల్యూ-101 హెలికాఫ్టర్లను సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వంతో 2010లో అగస్టావెస్ట్‌ల్యాండ్‌ రూ 3546 కోట్ల కాంట్రాక్టుపై సంతకాలు చేసింది. వీటిలో ఎనిమిది హెలికాఫ్టర్లు రాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల ప్రయాణానికి ఉద్దేశించినవి కావడం గమనార్హం.

ఈ ఒప్పందంలో 34 మంది వ్యక్తులు, సంస్థలు అక్రమ పద్ధతుల్లో పాలుపంచుకున్నారని మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. త్యాగి భాగస్వామిగా ఉన్న కంపెనీ ఈ ఒప్పందంలో రూ కోటి ముడుపులు అందుకుందని ఈడీ చార్జిషీట్‌లో ఆరోపించింది.

మరిన్ని వార్తలు