ఆధార్‌ ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయాలేంటి?

2 Oct, 2018 04:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయ మార్గాలను తెలపాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రైవేట్‌ టెలికం కంపెనీలను కోరింది. టెలికం వినియోగదారుల ధ్రువీకరణలో 12 అంకెల ఆధార్‌ను వాడటం నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు గత వారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో వొడాఫోన్, ఐడియా, రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ తదితర ప్రైవేట్‌ టెలికం సర్వీస్‌ ప్రొవైడర్స్‌(టీఎస్‌పీ)కు యూఐడీఏఐ ఇటీవల ఒక సర్క్యులర్‌ పంపింది.

‘సుప్రీంకోర్టు తీర్పు మేరకు తక్షణమే టీఎస్‌పీలు చర్యలు చేపట్టాలి. ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను ఈ నెల 15వ తేదీలోగా మాకు పంపండి’ అని అందులో యూఐడీఏఐ కోరింది. యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే దీనిపై వివరణ ఇస్తూ..‘ఆధార్‌ నిబంధనల ప్రకారం ఈ–కేవైసీ విధానం నుంచి సజావుగా బయటకు వచ్చేందుకు మరికొన్ని చర్యలు అవసరమవుతాయి. ఈ విషయంలో టెలికం కంపెనీలకు అవగాహన ఉంటుంది కాబట్టే 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను పంపాలని కోరాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు