హమ్మయ్య.. ఆ ముగ్గురికి కరోనా నెగటివ్‌!

21 Mar, 2020 20:23 IST|Sakshi

జైపూర్‌: తన, తన కుమారుడికి సంబంధించిన కరోనా వైరస్‌ పరీక్షల ఫలితాల్లో నెగటివ్‌ అని తేలిందని రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ లక్నోలో జరిగిన ఓ పార్టీలో వసుంధరా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన కనికాకు కరోనా సోకినట్లు వెల్లడికాడంతో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అంతేగాకుండా దుష్యంత్‌ సింగ్‌ వివిధ రాజకీయ నాయకులు, ఎంపీలను కలిసిన క్రమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కనికా హాజరైన పార్టీకి వెళ్లిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.(ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన కనిక!)

ఈ క్రమంలో వసుంధరా రాజే, దుష్యంత్‌ సింగ్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ‘‘ కోవిడ్‌-19 పరీక్ష నిర్వహించిన తర్వాత.. నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అయితే ఫలితాలు నెగటివ్‌గా వచ్చినప్పటి​కీ ముందు జాగ్రత్త చర్యగా మేం మరో 15 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటాం’’అని వసుంధరా రాజే ట్వీట్‌ చేశారు. అదే విధంగా తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వైద్యుల సూచన మేరకు తాము నిర్బంధంలో ఉంటామంటూ దుష్యంత్‌ సింగ్‌ కూడా ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా వీరితో పాటు పార్టీకి వెళ్లిన ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా కరోనా నెగటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా కనికా కపూర్‌పై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (మాస్కు ధర రూ. 8, శానిటైజర్‌ ధర రూ.100)

మరిన్ని వార్తలు