కాన్పూర్‌ ఎన్‌కౌంటర్‌.. 200 మంది పోలీసులపై విచారణ

7 Jul, 2020 20:49 IST|Sakshi

లక్నో: కాన్పూర్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల రాక గురించి వికాస్‌ దూబేకు ముందే సమాచారం అందిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసు శాఖకు చెందిన వారే వికాస్‌కు సమాచారం ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చౌబేపూర్‌ ఎస్‌హెచ్‌ఓ వికాస్‌ తివారీని ఇప్పటికే సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రసుత్తం 200 వందల మంది పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారందరిని ప్రత్యేకంగా విచారించనున్నారు. వీరిలో చౌబేపూర్‌ స్టేషన్‌కు చెందిన వారితో సహా ఇతర పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరికి వికాస్‌ దుబేతో మంచి సంబంధాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో చౌబేపూర్, బిల్హౌర్, కక్వాన్, శివరాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ల నుంచి 200 మందికి పైగా పోలీసులపై విచారణ చేపట్టారు. వీరందరి మొబైల్‌ కాల్‌ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కాన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన 10 మంది సిబ్బందిని సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.(యూపీ గ్యాంగ్‌స్టార్‌ కేసులో కొత్తకోణం)

అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్‌ దూబేను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో గతవారం  జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు