మోదీజీ.. నా నోరు మూయించలేరు

11 Jul, 2018 16:38 IST|Sakshi
స్వరాజ్‌ అభియాన్‌ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తనను, తన కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తున్నారని స్వరాజ్‌ అభియాన్‌ అధ్యక్షుడు, జై కిసాన్‌ ఆందోళన్‌ వ్యవస్ధాపకుడు యోగేంద్ర యాదవ్‌ ఆరోపించారు. రెవారిలో తన సోదరి ఆస్పత్రిపై ఐటీ దాడుల నేపథ్యంలో యోగేంద్ర యాదవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సోదరి నిర్వహిస్తున్న నర్సింగ్‌ హోంపై ఢిల్లీ నుంచి వచ్చిన వంద మం‍దికి పైగా అధికారుల బృందం దాడులకు పాల్పడిందని బుధవారం వరుస ట్వీట్లలో యాదవ్‌ పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వం ఇప్పుడు తమ కుటుంబాన్ని టార్గెట్‌ చేసిందని, రెవారిలో మద్దతు ధర కోసం, రైతుల సమస్యలపై తన పాదయాత్ర ముగిసిన రెండు రోజుల అనంతరం తన చెల్లెళ్లు నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఐటీ దాడులు చేపట్టారని ఆరోపించారు.

మోదీ తనపై, తన ఇంటిపై సోదాలు నిర్వహించవచ్చని తన కుటుంబాన్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆస్పత్రిపై ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందాలు వైద్యులైన తన చెల్లెళ్లు, బావ, మేనల్లుడి చాంబర్లను స్వాధీనం చేసుకుని ఆస్పత్రిని సీల్‌ చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీయూలో నవజాత శిశువులున్నా పట్టించుకోలేదని వాపోయారు. అణిచివేత వైఖరితో మోదీ తన నోరు మూయించలేరని మరో ట్వీట్‌లో యాదవ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు