మసకబారుతున్న మోదీ ప్రభ

5 Jan, 2015 00:47 IST|Sakshi
మసకబారుతున్న మోదీ ప్రభ

పార్లమెంటు సక్రమంగా పనిచేయడం భారత ప్రజాస్వామ్యానికి ముఖ్యం. ప్రధాని పార్లమెంటు అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొనాలి. ఉభయ సభలలోనూ మెజారిటీ ఉన్నా జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపక్షం పట్ల అత్యంత గౌరవం చూపేవారు, పీవీకి లోక్‌సభలో మెజారిటీ లేకున్నా పార్లమెంటు నుండి తాను కావాలనుకున్నదల్లా సాధించుకోగలిగారు. పార్లమెంటుకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం రాజీలకు సిద్ధపడి సభ సజావుగా సాగేందుకు హామీని కల్పించాలి. ప్రధాని మోదీ చేపట్టాల్సింది రాజీ వైఖరే తప్ప సంఘర్షణాత్మక వైఖరి కాదు.
 
నరేంద్ర మోదీ ప్రభుత్వం సజావుగా సాగుతోంది. హర్యానా మహారాష్ట్ర, జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ దిగ్భ్రాంతికరమైన విజయాలను సాధించింది. కాబట్టి గత సంవత్సరం విజయోత్సాహభరితంగా ముగిసి ఉండాల్సింది. కానీ పార్లమెంటు శీతాకాల సమావేశాలు విజయవంతం కాలేదు. బీజేపీకి లోక్‌సభ లో మెజారిటీ ఉందిగానీ రాజ్యసభలో లేదు. అలాంటి పరిస్థితుల్లో చట్టం చేయా లంటే ప్రభుత్వం ఉభయ సభలను కలిపి సమావేశపరచి ఆమోదముద్ర వేయిం చుకోవాలి. అయితే అది అరుదైన, తీవ్ర పరిష్కారం.

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవ డానికి దోహదపడేపలు బిల్లులకు బీజేపీ రాజ్యసభ ఆమోదాన్ని పొందాలను కుంది. ప్రభుత్వ తక్షణావశ్యకతను గుర్తించిన ప్రతిపక్షం ఏదో ఒక సాకుతో అందుకు అడ్డంకులను సృష్టించడం ప్రారంభించింది. మరింత ప్రజా వ్యతిరేకత ను మూటగట్టుకోవాల్సి వస్తుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సమావేశాలకు విఘాతం కలిగించడానికి తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల వంటి చిన్న పార్టీలను  వాడుకుంది. విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన మతమార్పి డుల సమస్యలో మోదీ ప్రతిష్టను మసకబరచే అవకాశాన్ని పసిగట్టిన ప్రతి పక్షాలు ప్రధాని ఆ అంశంపై మాట్లాడాలని పట్టుబట్టాయి.

బీజేపీ సహజంగానే రాజ్యసభలో మోదీ మాట్లాడకుండా చూసింది. కానీ ప్రభుత్వం ఆర్థిక సంస్క రణలు, బీమా, భూసేకరణలకు సంబంధించిన చట్టాలను తేవాల్సి ఉంది. కాబట్టి ఆర్డినెన్స్‌లకు జారీ చేసి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించుకుంది. ఆర్డినెన్స్ కూడా చట్టమేగానీ, ఆరు నెలలలోగా అది పార్లమెంటు ఆమోదం పొందాలి. అత్యంత జరూరైతే తప్ప ఆర్డినె న్స్‌లను జారీ చేయకూడదు. ఇలా ఆర్డినెన్సులను జారీ చేయడం ద్వారా పార్లమెంటును నియంత్రించలేని తన బలహీనతను బీజేపీ బయటపెట్టుకుంది.
 
ప్రతిపక్షాల పట్ల మన్నన చూపడమే రాజనీతి

సాధారణంగా అసహనాన్ని చూపే ప్రజలు సైతం సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పడిందని మోదీపట్ల సంతృప్తితోనే ఉన్నారు. పెద్ద చదువుగానీ, అనుభవంగానీ లేని మోదీ విదే శీ వ్యవహారాలను చక్కబెట్టలేరని చాలా మంది తక్కువగా అంచనా వేశారు. అది తప్పని రుజువైంది. దేశాన్ని నడపడం అంటే కేవ లం అధికారులను నియంత్రించడం కాదు. కొత్త చట్టాలను చేయాల్సిందే. కానీ పార్లమెంటు, అది సక్రమంగా పనిచేయడం భారత ప్రజాస్వామ్యానికి ముఖ్యం. ప్రధాని పార్లమెంటు అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొనాలి. ప్రతి పక్షం చిన్నదే అయినా, ప్రధాని పార్లమెంటును తోసిపుచ్చకూడదు. ఉభయ సభలలోనూ మెజారిటీ ఉన్నా జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపక్షం పట్ల అత్యంత గౌరవం చూపేవారు, వారి కోరికలను మన్నించడానికి ఎప్పుడూ ప్రయత్నించే వారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు (1991-96) లోక్‌సభలో మెజారిటీ లేదు. అయినాగానీ పార్లమెంటు నుండి తాను కావాలనుకున్నదల్లా ఆయన సాధించుకోగలిగారు. ఆయన హయాంలో దేశం ఆర్థిక సంక్షోభాన్ని, పంజాబు తిరుగుబాటును, కశ్మీర్ సమస్యను, అస్సాం హింసకాండను ఎదుర్కో వాల్సి వచ్చింది. అయినా ఆయన పార్లమెంటును తనతోపాటు నడిపించ గలిగారు. విడిగాఎంపీల పట్ల, పార్టీల పట్ల సానుకూల వైఖరి చూపేవారు. ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయిని ఐరాస ప్రతినిధి బృందాలకు నేతగా నియమిం చారు. ప్రతిపక్ష ఎంపీల పట్ల మన్నన చూపాలని పీవీ తన మంత్రివర్గ సహచ రులకు చెప్పేవారు. అలా ఆయన పార్లమెంటు అభిమానాన్ని చూరగొన బట్టే 225 మంది ఎంపీలతో ఐదేళ్లూ పదవిలో ఉన్నారు. మోదీకి 280 మందికి పైగా ఎంపీలున్నారు. కానీ ఆయన పార్లమెంటులో ఉన్నది లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన విజయవంతమై ఉండవచ్చు. కానీ పార్లమెంటు, ఢిల్లీలో అధికారం నెరపడం పూర్తిగా భిన్నమైనవి. ఎంపీలకు ప్రధాని తప్పక అప్పయింట్‌మెంట్‌లు ఇవ్వాలి. చట్టం పరిధిలో వారు అడిగేవాటిని నెరవేర్చా ల్సి ఉంటుంది. పీవీ ఉదాహణను మోదీ ఏ కొద్దిగా పాటించి ఉన్నా ఆయనకు పార్లమెంటులో సమస్యే ఉండేది కాదు. ప్రతిపక్ష నేతలు సమస్యలు సృష్టించాల నుకున్నా పార్లమెంటు సభ్యులు పాల్గొనేవారు కారు.  
 
సభ సజావుగా సాగాలంటే...


1. ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాన్ని గౌరవించాలని, వారు తమ విధానాలను ఆమోదించేలా చేసుకోవాలని మోదీ, బీజేపీలు అర్థం చేసుకోవాలి, నచ్చజెప్పే పద్ధతుల్లో వారితో రాజీ పడాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిపక్షం మద్దతును కూడగట్టడంలో, దానితో క్రియాశీల సంబంధాలను నెలకొల్పుకోవడంలో విఫలమయ్యారు. కాబట్టే ఇటీవలి కాలంలో కొత్త చట్టాలను చేయలేకపోయారు. ఇక్కడా అదే జరుగుతోంది.

2. బీజేపీ తానిప్పుడు ప్రతిపక్షంలో లేనని అర్థం చేసుకోవాలి. పార్లమెంటు చర్చల్లో గెలవడమే ప్రధానమని అది భావిస్తోంది. కానీ వాస్తవానికి ప్రతిపక్షాలన్నీ దానికి వ్యతిరేకంగా ఐక్యమవుతున్నాయి, ప్రతిపక్షంతో సుహృద్భావ పూర్వకంగా సంభాషించగల నేతే బీజేపీలో లేనట్టుం ది.

3. బీజేపీ మంత్రుల్లో చాలా మంది వృత్తి రాజకీయవేత్తలు కారు. పైగా వారిలో ఎక్కువ మంది ఎలాంటి ప్రజాపునాది లేనివారు, రాజ్యసభ సభ్యులు. ప్రతిపక్ష ఎంపీల పట్ల మన్నన చూపాలని, వారి ఓటర్ల కోరికలను కూడా మన్నిం చి ప్రభుత్వానికి వారి మద్దతును కూడగట్టాలని తెలియదు.
 
4. మాజీ మంత్రులను, ఓటమిపాలైన ఎంపీలను అధికారిక నివాసాల నుండి ఖాళీ చేయించడాన్ని ప్రభుత్వం పెద్ద సమస్యను చేసి, మొత్తంగా ఢిల్లీ రాజకీయ వర్గమంతటికీ ఆగ్రహం కలిగేలా చేసింది. అది చేయాల్సిన పనే అయినా సున్నితంగా చేయవలసినది. ప్రత్యర్థి రాజకీయవేత్తలను అవమా నిస్తున్నట్టుగా గాక, 62 ఏళ్లుగా నెలకొన్న సంప్రదాయాలను పాటిస్తున్నట్టుగా ఉండాల్సింది.

5. విజయవంతమైన ప్రతి ప్రభుత్వానికి ప్రతిపక్షంతో సంబం ధాలు నెరపే దొడ్డిదారులు ఉంటాయి. బీజేపీకి ప్రతిపక్షాన్ని ఒప్పించడంలో నైపుణ్యం, లౌక్యం పూర్తిగా కొరవడ్డాయి. భారీ మెజారిటీ ఉన్నా ఇందిరాగాంధీ ప్రతిపక్షం ఆమోదాన్ని పొందడంలో విఫలమై, అప్రతిష్టపాలయ్యారు. మెజారి టీ లేకున్నా పీవీ ఆమెలా ఎన్నడూ ప్రతిపక్షాల దాడులకు గురై ఎరుగరు. అదీ తేడా.

6. మోదీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్నారు. ప్రతిపక్ష ఎంపీలకు అందుబాటులో లేకుండా, సహాయాన్ని అందించని వైఖరిని అవలంబి స్తున్నారు. ఆయన ఆ వైఖరిని మార్చుకోవాలి. రాజ్యసభలో మెజారిటీ లభిస్తే చాలు, ఏమైనా చేయవచ్చని ఆయన అనుకుంటున్నారు. పార్లమెంటరీ వ్యవస్థ పనిచేసేది అలా కాదు. ఎంత గొప్ప మెజారిటీ ఉన్నా ప్రభుత్వం ప్రతిపక్షాన్ని కూడా తన వెంట తీసుకుపోవాలి. అదెంత కష్టమైనా చేయక తప్పదు.

7. బీజేపీ 2004 నుండి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండి నిరంతరం పార్లమెంటుకు ఆటం కం కలిగించింది. ప్రతిపక్షాలకు ఉదాహరణగా మారింది. బడా కార్పొరేట్లు సైతం పార్లమెంటుతో సరిగా వ్యవహరిచలేకపోతోందని ప్రభుత్వాన్ని తప్పు పడుతుండటం ఆసక్తిదాయకం. పార్లమెంటుకు బాధ్యత వహించాల్సిన ప్రభు త్వం తీవ్ర రాజీలకు సిద్ధపడి మరీ సభ సజావుగా సాగేందుకు హామీని కల్పించా లి. పార్లమెంటు నడిచేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది కాదు. పలువురు మంత్రులు మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ తప్పుటడుగులు వేసేలా చేస్త్తు న్నారనే అభిప్రాయం కూడా ఉంది.
 
నెహ్రూ, పీవీల బాటలో సాగాల్సిందే...

ప్రధాని మోదీకి ఎంత జనాదరణ ఉన్నాగానీ ఆయన నెహ్రూ, పీవీల వంటి పూర్వ ప్రధానుల లాగే ప్రతిపక్షాల ఆమోదాన్ని సంపాదించుకోవాలి. మరో గుజరాతీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి 1977లో 377 మంది లోక్‌సభ ఎంపీలుండే వారు. కానీ పట్టువిడుపులు, రాజీలేని ఆయన ధోరణి వల్ల ప్రభుత్వం మూడేళ్ల లోగానే కుప్పకూలిందని మోదీ గుర్తుంచుకోవాలి. బీజేపీ తన గెలుపుతో ఇక రాజకీయాలన్నీ అంతమైపోయాయని భావిస్తోంది. ప్రజాస్వామ్యంలో అదెన్న టికీ జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స ఎన్నికల వరకు తనకు ఎదురే లేదనుకున్నారు. కానీ పదిహేనేళ్లుగా ఆయనకు సన్నిహితులైన మంత్రులు సైతం ఆయనను వీడుతున్నారు.

రాజకీయవేత్తలు ఎప్పుడూ దెబ్బ తీయడానికి సరైన సమయం కోసం వేచి చూస్తుంటారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రత్యర్థులు  పలువురిని తమ పక్షానికి తె చ్చుకోగలిగారు. కాబట్టే విజయాలు సాధించారు. బీజేపీ పార్లమెంటులో కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలి. ఇప్పుడు దానికి పార్లమెంటు సజావుగా సాగేలా చేసే ఒక అమిత్ షా అవసరం. మోదీ పార్లమెంటులో తన వైఫల్యం ఎక్కడుందో, ఎందుకో సమీక్షించుకోవాల్సి ఉంది. పార్లమెంటు గౌరవాన్ని సంపాదించుకోలేకపోవడం వల్లే గొప్ప విజయా లు సాధిస్తున్నా గానీ ఆయన ప్రతిష్ట దెబ్బతింటోంది. ప్రధానిగా మోదీ తన పదవీ కాలం మొదట్లో చేపట్టాల్సింది రాజీ వైఖరే తప్ప, సంఘర్షణాత్మక వైఖరి కాదని గ్రహించాలి. సలహాదారులను పక్కకు నెట్టి, ఆయన రాజీలు చేసుకోవాలి. సమస్యాత్మకమైన అంతర్జాతీయ నేతలతో అంత బాగా వ్యవ హరించగలుగుతున్న ఆయన మన రాజకీయ నేతలతో అదే పని ఎందుకు చేయలేరు?

- (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)
 

మరిన్ని వార్తలు