మత్స్యకారుల జీవితానికి చుక్కానిగా...

21 Nov, 2023 04:32 IST|Sakshi

సందర్భం

చేపల వేటే జీవనాధారంగా బతికే మత్స్యకారులు సామాజికంగానూ, ఆర్థికంగానూ అత్యంత వెనుకబడి ఉన్నారు. ఆటువంటి వారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నివిధాలా ఆదుకొంటున్నారు. రాజ్యాధికారంలో వాటాను పంచారు. ఆర్థికంగా చేయుత నిచ్చారు. పార్లమెంటు మెట్లే ఎక్కని మత్స్య కార వర్గం నుంచి తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపారు. దేశ అత్యున్నత చట్ట సభలో మత్స్య కారుడికి అవకాశం కల్పించిన ఘనత జగన్‌కే దక్కింది.

ఎప్పుడూ లేని విధంగా మత్స్యకార వర్గానికి 4 ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. మత్స్యకార సామా జికవర్గంలోని 14 ఉప కులాలను విభజించి ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. జగన్‌ సీఎం అయ్యే వరకు టీటీడీ బోర్డులో మత్స్యకారులకు చోటే దక్క లేదు. తొలిసారిగా మొదట మల్లాడి కృష్ణారావుకూ, రెండవసారి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌కూ టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించారు. నామినేటెడ్‌ పోస్టుల్లో మత్స్యకారుల సామాజిక వర్గానికి అత్యధిక పదవులు ఇచ్చారు. 

రాష్ట్రంలో సముద్రంపై వేటకు వెళ్లే 1.23 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్‌ 15– జూన్‌ 14 మధ్య కాలంలో ఈ కుటుంబాలవారు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ. 123.52 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అలాగే ఓఎన్‌జీసీ సంస్థ పైప్‌ లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23.45 వేల మత్స్యకార కుటుంబాలకు దాదాపు రూ. 108 కోట్ల సాయాన్ని సీఎం జగన్‌ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకం ద్వారా అందించిన సాయం రూ. 538 కోట్లుగా ఉంది. ఏటా రూ. 10 వేల చొప్పున మత్స్యకార భరోసా పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 50 వేల లబ్ధి చేకూరింది. 

సముద్రంపై వేటకు వెళ్లే మత్యకారుల స్థితిగతు లను బాగు చేయడంతో పాటు వలసలను అరికట్టే లక్ష్యంతో రూ. 3.7 వేల కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ లాండింగ్‌ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతులకు మరింత ఊతమిచ్చేందుకు 4 ఏళ్ళలోనే సుమారు రూ. 16 వేల కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అర్హత, నైపుణ్యం గల మానవ వన రులను తయారు చేసేందుకు తద్వారా మెరుగైన ఫిషింగ్‌ చేసుకునే పరిజ్ఞానం పెరిగేలా పశ్చిమ గోదా వరి జిల్లా నరసాపురంలో ‘ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీష్‌ విశ్వ విద్యాలయం’ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఆర్బీకేలలో ఫిషరీస్‌ అసిస్టెంట్స్‌ నియామకాన్ని చేపట్టారు. మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకే తిక పరిజ్ఞానాలపై శిక్షణ ఇస్తున్నారు. నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్‌పుట్స్‌ కూడా ఆర్‌బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. మత్స్య సాగుబడి కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు విస్తరణ సేవలు, పంట సలహాలు అందిస్తున్నారు. ఆక్వా రైతులకు యూనిట్‌ రూ. 1.50లకే సబ్సిడీపై విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్ట్‌ 2020 అమలు చేస్తోంది ప్రభుత్వం. ఇన్‌పుట్‌ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందించడానికి తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటు చేశారు. 

ఇలా ఇప్పటివరకూ ఎవరూ చేయని విధంగా జగన్‌ మత్స్యకారులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తూ వారి బతుకు నావకు చుక్కాని అయ్యారు. అందుకే ఆయన రుణం తీర్చు కోవడానికి వారంతా ఎదురుచూస్తున్నారు.

బందన పూర్ణచంద్రరావు
వ్యాసకర్త జాతీయ మత్స్యకార సంఘం వైస్‌ చైర్మన్‌ మొబైల్‌: 90102 01616
(నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం) 

మరిన్ని వార్తలు