చిరంజీవ... చిరంజీవ!

29 Aug, 2015 00:29 IST|Sakshi
చిరంజీవ... చిరంజీవ!

అక్షర తూణీరం

కథానాయకుడుగా చిత్రపరిశ్రమని కొల్లగొట్టారు చిరంజీవి. ఆయన కాలు కదిపితే అశేషప్రజ అడుగులకు మడుగులొత్తారు. ఆయన పోరాట పటిమకు హారతులు ఇచ్చారు. కనకవర్షాలు కురిపించారు. ఇది హాయిగా ఆ కనకాన్నీ, కీర్తినీ నెమరు వేసుకోవలసిన సమయం. అన్నింటినీ చక్కగా జీర్ణం చేసుకోవలసిన సందర్భం.
 
ఆ మధ్య కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు - ‘‘చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకి మూ డో కన్ను’’ అని.  నిజానికి మూడో కన్ను మాత్రమే శక్తి వంతమైంది. ఆ రెండు కళ్లూ చూట్టానికీ, చూడకుండా ఉం డటానికీ, బాష్పాలు వదలడా నికీ మాత్రమే పనికొస్తాయి. మూడో కన్ను సందర్భాన్ని బట్టి నిప్పులుముస్తుంది. ప్రళయం సృష్టిస్తుంది. మూడో కన్ను తెరిచాడంటే యిహ ఖతం అని అర్థం. పరిశ్రమ మాట పక్కన పెడితే, రాజకీయాల్లో మాత్రం చిరంజీవి మూడో కన్ను కాలేకపోయాడు. అంతే ఒక్కోసారి- ఒక వూరి కరణం మరో వూరికి వెట్టి అవడం మామూలే.

అరవై ఏళ్ల తర్వాత, తీరిగ్గా వెనక్కి తిరిగి చూస్తే- చిరంజీవి హీరోగా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఒంట్లో శిల్పం ఉంది. కంట్లో దీపం వుంది. కథానాయికలను కథోచితంగా, యథోచితంగా అలరించినవాడు. ప్రతి అడుగూ ఆచితూచి వేసిన వాడు. కొంచెం లేటు వయ సులో రాజకీయం లోతులు తెలియక అడుగు పెట్టాడు. నల్లేరు మీద బండినడక అనుకున్నారు. అది పల్లేరు మీద కాలి నడక అయింది. బురద అంటుకుంది గాని సత్కీర్తి అంటలేదు. ఆ రోజుల్లో చిరంజీవిని ‘వెండి తెరకు పెట్టని విగ్గు’గా అభివర్ణించేవారు. ఆడామగా మాడా ఎవరైనా విగ్గుకి తలవంచాల్సిందే కదా. కాసేపు ఫ్లాష్ బ్యాక్‌ని పక్కన పెడితే, కనిపిస్తున్న శకునాలు మార్పుల్ని సూచి స్తున్నాయి. వెంకయ్య నాయుడు ట్వీటర్ కిచకిచల్ని పరిశీ లిస్తే, ఆ భాషలో అంతరార్థాలు వినవస్తున్నాయి. కాం గ్రెస్ కొంపదీసి ఒక వేళ చిరంజీవి భాజపాలోకి అడుగు పెట్టరు కదా. ఓ వేళ వేస్తే గీస్తే అది త్రివిక్రముడి మూడో అడుగు కారాదని ఆశిద్దాం.

అట్నించి చూస్తే - చిరంజీవి అవసరం భాజపాకి వుంది. గ్లామరు, గ్రామరు కూడా సరిపోతుంది. సంధి సూత్రాలు, సమీకరణాలు సరిపోతాయి. ఊతకర్రల్ని వదిలించుకుని రాష్ట్రంలో సొంత కాళ్ల మీద నుంచోవాల ని భాజపా ఆశపడుతోంది. ఇట్నించి చూస్తే- ఆద్యతన భవిష్యత్తులో కాంగ్రెస్‌కి మహర్దశ పట్టే అవకాశాలు కని పించడం లేదు. వున్న గడిలో గాలి వెలుతురూ లేదు. ఆశాకిరణాలు పొడసూపడం లేదు. అరవై వయసు ఆలో చించాల్సిన వయసు. ఇంకో తప్పు చేయతగ్గ మజిలీ కాదు. కథానాయకుడుగా చిత్రపరిశ్రమని కొల్లగొట్టారు చిరంజీవి. ఆయన కాలు కదిపితే అశేషప్రజ అడుగులకు మడుగులొత్తారు. ఆయన పోరాట పటిమకు హారతులి చ్చారు. కనకవర్షాలు కురిపించారు. ఇది హాయిగా ఆ కన కాన్ని కీర్తిని నెమరేసుకోవలసిన సమయం. అన్నింటినీ చక్కగా జీర్ణం చేసుకోవలసిన సందర్భం. అందుకు మిగి లిన దినుసులతో పాటు పవర్ అనే లాలాజలం కూడా కలిస్తే చక్కహా వుంటుంది.

అరవయ్యవ మైలురాయి మీద కూచుని శివశంకర్ ప్రసాద్ సింహావలోకనం చేసుకుంటున్నారు. అదే సమ యంలో భాజపా వెంకయ్య మెగా ఎరతో గాలాన్ని పట్టు కుని తీరం వెంట తిరుగుతున్నారు. ‘‘సువీ అంటే రోకలి పోటని వేరే చెప్పాలా. హస్తినలో అనేక రాచకార్యాలుం డగా, తోచీ తోచనమ్మ తోడుకోడలు పుట్టింటికి వచ్చి నట్టు స్వయంగా వచ్చి మరీ ప్రశంసలు కురిపించాలా? ట్వీటర్ తరవాత ఎంతటి మందభాగ్యుడికైనా డౌటు రాకతప్పదు. మార్పిడీదారుడు కొన్నాళ్లు వార్తలకి దూ రంగా వుండి పాత చిలువు వదుల్చుకుంటారు. తర్వాత ‘నా లక్ష్యం, నా బతుకు ప్రజాసేవ. పార్టీలు పై కండు వాలు మాసిపోతే వుతుకుతాం. నచ్చకపోతే మారు స్తాం’’ అంటూ అంతరాత్మ ప్రబోధానికి డబ్బింగ్ చెప్పే స్తారు. పై సంగతులన్నీ వూహాగానాలు. దీనికో ప్రత్యా మ్నాయం వుంది. అదేంటంటే చిరంజీవి వున్నచోటే ఉం డిపోవడం.







శ్రీరమణ
వ్యాసకర్త ప్రముఖ కథకుడు.

మరిన్ని వార్తలు