టీటీడీ వైఖరి సరికాదు

4 Jan, 2015 00:44 IST|Sakshi

టీటీడీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఆన్‌లైన్‌లో ఇచ్చే ఇ-సుద ర్శన్ స్లాట్ల సంఖ్యను కుదించివేసి ఒకే ఒక్క స్లాట్‌కు పరిమితం చేసింది. ఆ స్థానంలో ఇ-స్పెషల్ ఎంట్రీ దర్శన్ అని నామకరణం చేసి 300 రూపాయల టికెట్ల అమ్మకాన్ని ఆన్‌లైన్‌లో చేపట్టింది.  స్పెషల్ దర్శన్ టికెట్ల స్థానంలో సంస్కరణల పేరుతో ఆన్‌లైన్ లోపెట్టి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చివేసిన దేవస్థానం స్పెషల్ ఎంట్రీ దర్శన్‌కు 5 స్లాట్లను, యాభై రూపా యల టికెట్‌తో ఇ-సుదర్శన్‌లో ఒకే ఒక్క స్లాట్ ను అది కూడా సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల మధ్యలో  కేటాయించింది. కలియుగ దైవాన్ని డబ్బున్న మారాజులు తప్ప సాధారణ భక్తులు గంటల తరబడి సర్వదర్శనం క్యూలైన్లలో నిరీక్షించి దర్శించుకోవాలన్నదే టీటీడీ ఉద్దేశంగా కనబడుతోంది.

 

భారీ  బడ్జెట్ ఉన్న టీటీడీ ఆన్‌లైన్ సైట్‌ను కూడా సరిగా నిర్వహించ లేకపోతోంది. దేశంలోనే అతిపెద్ద దేవస్థానాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న టీటీడీ ఇటువంటి చిన్న విషయాలపైన కూడా దృష్టి సారించి ఇకనుంచైనా వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని కోరుతున్నాను. ఇ-సుదర్శన్ స్లాట్ల సంఖ్యను కూడా పూర్వపు స్థాయికి పెంచి సామాన్య భక్తులకు ఆ దేవదేవుని దర్శన భాగ్యాన్ని కలిగించి, భక్తుల మన్ననలను పొందాలి.
 -గొడవర్తి రామకృష్ణ  ఏడిద, తూ.గో. జిల్లా

>
మరిన్ని వార్తలు