గాజా ఒడ్డున విపత్తు వంటకం

4 Dec, 2023 00:28 IST|Sakshi
దక్షిణ గాజా ప్రాంతంపై జరిగిన బాంబు దాడులలో గాయపడిన బాలలు

కామెంట్‌

సంధి గడువు ముగియగానే... గాజాపై ఇజ్రాయెల్‌ ఉద్దేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. బెంజమిన్  నెతన్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న దాదాపు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్‌–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తోందని తెలుస్తోంది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘విపత్తు వంటకం’గా అభివర్ణించారు. 1948లో వెస్ట్‌ బ్యాంక్‌ నుంచి తమను తరిమేసినప్పుడు తొలిసారి శరణార్థులుగా మారిన గాజా ప్రజలు... ఇప్పుడు అల్‌–మవాసిలో చిక్కువడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు.

ఇప్పటివరకు అర్థం అవుతున్నదానిని బట్టి మన దృష్టి ఇజ్రాయెల్‌కూ, గాజాలోని పాలస్తీనా ప్రజలకూ మధ్య సంబంధాలపైన మాత్రమే కేంద్రీకతం అయి ఉంది. యుద్ధ సమయంలో ఇది అనివార్యంగా జరిగేదే. అయితే మీరు కనుక ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు మధ్య గల విస్తృతమైన సంబంధాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం ఇజ్రాయెల్‌ తన లక్షల మంది పాలస్తీనా పౌరులను, వారితో పాటుగా 1967 నుంచి చట్టవిరుద్ధంగా తన ఆక్రమణలో ఉంచుకున్న వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంత పాలస్తీనియన్లతో ఎలా వ్యవహరిస్తూ వస్తున్నదో కూడా తెలుసు కోవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇస్తున్న కొన్ని వాస్తవాలు బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు.  

మొదటిది, ఇజ్రాయెల్‌ ప్రజాస్వామ్య దేశం. కానీ అది యూదు పౌరులకు మాత్రమే. అక్కడి ‘నేషనల్‌ స్టేట్‌ చట్టం – 2018’ యూదు పౌరులకు, దేశంలోని పాలస్తీనా జాతీయులకు మధ్య వివక్షను పాటిస్తోంది. ఉదాహరణకు, ఇజ్రాయెల్‌లోని ‘పునరాగమన చట్టం’ (లా ఆఫ్‌ రిటర్న్‌) ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చిన యూదులైనా అప్రమేయంగా ఇజ్రాయెల్‌ పౌరసత్వం పొందేందుకు అనుమతిని ఇస్తోంది. కానీ అక్కడే పుట్టి, 1948 నక్బా (జాతి ప్రక్షాళన) విపత్తులో, 1967 యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌ను వదిలి వెళ్లిన పాలస్తీనా కుటుంబాల వారికి మాత్రం ఈ హక్కును నిరాకరిస్తుంది. తరలిపోయిన అన్ని పాలస్తీనా కుటుంబాలు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు హక్కును కల్పిస్తున్న ఐక్యరాజ్య సమితి 194వ తీర్మానాన్ని ధిక్కరించడమే ఇది.

రెండవది–ఎటువంటి అభియోగమూ లేకుండా పాలస్తీనియన్లను నిర్బంధంలోకి తీసుకునేందుకు అనుమతినిచ్చే ‘అడ్మినిస్ట్రేటివ్‌ డిటెన్షన్‌ లా’ను ఇజ్రాయెల్‌ కలిగి ఉంది. ‘అల్‌ జజీరా’ చెబుతున్న ప్రకారం, ఇజ్రాయెల్‌ జైళ్లలో 7,200 మంది పాలస్తీనా ఖైదీలు ఉంటే వారిలో 2,200 మంది ఎలాంటి అభియోగమూ లేకుండా అరెస్ట్‌ అయినవారే. గత వారాంతంలో కాల్పుల విరమణ సందర్భంగా, ఇజ్రాయెల్‌ ఈ వైపు నుంచి 240 మందిని విడుదల చేస్తూనే, ఆ వైపు నుంచి 310 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. 3,100 మంది లేదా 7,200లో 43 శాతం మంది అక్టోబర్‌ 7 తర్వాత (ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసిన రోజు) అరెస్ట్‌ అయినవారే.  

ఇక, వెస్ట్‌ బ్యాంకు వైపు వెళ్దాం. 1967 నుండి 7,50,000 మంది ఇజ్రాయెలీలు వెస్ట్‌ బ్యాంక్‌ అనే పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించి, లోపలి వాళ్లను ఖాళీ చేయించి తాము అక్కడ స్థిరపడిపోయారు. ఇజ్రాయెల్‌ సైన్యం ఆక్రమణదారులను అడ్డుకోక పోగా, వారికి రక్షణ కల్పించింది. దీనిని నెతన్యాహూ ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఉన్న పాలస్తీనాను కుట్టడానికి వీలుకాని అతుకుల బొంతలా మార్చింది.  

వెస్ట్‌ బ్యాంక్‌కు వలస వచ్చి స్థిరపడిపోయిన ఇజ్రాయెలీలతో ఈ ఏడాది అక్టోబర్‌ 7 నుంచి జరుగుతున్న హమాస్‌ ఘర్షణల్లో 240 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ‘అల్‌ జజీరా’ నివేదించింది. ‘‘వెస్ట్‌ బ్యాంక్‌లో పాలస్తీనియన్‌లపై జరుగుతున్న తీవ్రవాద హింస ఆగాలని, హింసకు పాల్పడేవారిని జవాబుదారులను చేసి తీరాలని’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ఇజ్రాయెల్‌ నాయకులకు నొక్కి చెప్పి నట్లు ‘వాషింగ్టన్  పోస్ట్‌’ కథనం పేర్కొంది. కానీ బైడెన్  మాటలను నెతన్యాహూ లెక్క చేయలేదు. ‘‘స్థిరపడిన వారి కదలికల గురించి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని అధ్యక్షుడు బైడెన్‌కు చెప్పాను’’ అని పత్రికా సమావేశంలో అన్నారాయన.

చివరిగా, çసంధి గడువులన్నీ ఒకసారి ముగిశాక గాజాపై ఇజ్రా యెల్‌ ఉద్దేశాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిన అంశం. నెత న్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న సుమారు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్‌–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తూ ఉందన్న విషయాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతినిధిని ఉటంకిస్తూ ‘బీబీసీ’ దౌత్య సంబంధాల ప్రతినిధి పాల్‌ ఆడమ్స్‌ బహిర్గతం చేశారు. 1948లో వెస్ట్‌ బ్యాంక్‌ నుంచి తమను తరిమేసినప్పుడు గాజా ప్రజలు తొలిసారి శరణార్థులుగా మారారు. ఇప్పుడు వారు అల్‌–మవాసిలో చిక్కు పడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు.  

నిజంగా ఇది అధ్వాన్నమైన స్థితి. పాలస్తీని యన్ల సంక్షేమం కోసం పని చేస్తుండే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్‌.ఆర్‌.డబ్లు్య.ఎ. కమ్యూనికేషన్్స డైరెక్టర్‌ జూలియెట్‌ తౌమా... అల్‌– మవాసి గురించి చెబుతూ ‘అక్కడ ఏమీ లేదు. కేవలం ఇసుక దిబ్బలు, తాటి చెట్లు మాత్రమే’ అని అన్నారు. ఆఖరికి ఇజ్రాయెల్‌ రక్షణ దళాల ప్రతినిధి అయిన లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ హెక్ట్‌ కూడా ‘‘అల్‌–మవాసి భయానకం కాబోతోంది’’ అన్నారు.  

అల్‌–మవాసీలో అవసరం అయిన మౌలిక సదుపాయాలు లేవు. ఆసుపత్రులు లేవు. అంతే కాదు, అత్యధికులు గుడారాలలో నివసించవలసి వస్తుంది. చలికాలం మొదలయ్యాక చలి గజగజ లాడిస్తుంది. తరచు వర్షాలు పడుతుంటాయి. అయినప్పటికీ కూడా... ‘‘మీ ప్రియమైన వారికి అల్‌–మవాసి అనుకూలమైన పరిస్థితులనే అంది స్తుంది’’ అని ఇజ్రాయెల్‌ రక్షణ దళానికి చెందిన మరొక ప్రతినిధి అవిచే ఆడ్రయీ చెబుతున్నారు.

‘‘అల్‌–మవాసికి సదుపాయాలు అందేలా చేయడం సహాయక సంస్థల బాధ్యతే’’నని ఇజ్రాయెలీ అధికారులు అన్నట్లు ‘బీబీసీ’ నివే దించింది. దీనిని బట్టి గాజావాసులను వారి కర్మకు వారిని ఇజ్రాయెల్‌ వదిలేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ ఆ మాటను వారు ఒప్పుకోడానికి సుముఖంగా లేరు. ‘‘గాజాలో జరగబోయే ఎలాంటి సురక్షిత ప్రాంత ఏర్పాటులోనూ మేము పాల్పంచుకోబోమని ‘ఐ.రా.స.’కు చెందిన 18 సంస్థలు, ఎన్జీవోలకు చెందిన అధినేతలు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఈ అల్‌–మవాసి ప్రతి పాదనను... ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘‘విపత్తు వంటకం’’ అని అభివర్ణించారు. ‘‘సదుపాయాలు, సేవలు అందుబాటులో లేని అంత చిన్న ప్రదేశంలోకి అసంఖ్యాకంగా మనుషులను చేర్చడానికి ప్రయ త్నించడం వల్ల ఇప్పటికే ప్రమాదపుటంచున ఉన్న గాజా పౌరుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది’’ అని హెచ్చరించారు.

ఇక్కడితో నేను ఆగిపోతాను. మీకు చేరని వాస్తవాలను, మన మీడియా వెల్లడించని ఇజ్రాయెల్‌ ఆలోచనలను మీకు తెలియ జేయడమే నా ఉద్దేశం. ఈసారి ఇజ్రాయెల్‌ను ఒక వర్ణవివక్ష రాజ్యం అని అనవలసి వచ్చినప్పుడు ఈ మాటలను దన్నుగా చేసుకోండి.
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

>
మరిన్ని వార్తలు