సాక్షి, విశాఖపట్నం: తన ప్రచారంతో, అడ్డగోలు వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. తాజాగా విచిత్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలువడానికి టీడీపీనే కారణమంటూ ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కృషి వల్లనే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి ఆ మూడు రాష్ట్రాల్లో చంద్రబాబు కనీసం ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని.. ఆయన విస్తృతంగా ప్రచారం చేసిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
మహాకూటమి పేరిట కాంగ్రెస్ పార్టీతో జతకలిసిన చంద్రబాబు.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ ఇదేవిధంగా ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఆధునిక తెలంగాణ నిర్మాతను తానేనని, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్రోడ్డు తానే కట్టానని ఆయన ఎన్నో గొప్పలు పోయారు. అసలే తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబు.. ఇలా ఇష్టారీతిగా మాట్లాడటంతో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడమే కాదు.. పొత్తుతో వచ్చిన చంద్రబాబును రెండు సీట్లకు మాత్రమే పరిమితం చేసి.. గుణపాఠం నేర్పారు. అయినా, చంద్రబాబు తీరు మారనట్టు కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలను ఆయన తన ఖాతాలో వేసుకోవడంతో హస్తం శ్రేణులు సైతం విస్తుపోతున్నాయి.