భన్సాలీ ‘పద్మావతి’కి భారీ షాక్‌!

2 Nov, 2017 18:24 IST|Sakshi

సినిమా విడుదలను వాయిదా వేయండి

కేంద్ర ఎన్నికల సంఘం, సెన్సార్‌ బోర్డుకు లేఖ రాయనున్న బీజేపీ

బాలీవుడ్‌ సినీ ప్రేమికులు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ’పద్మావతి’... ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించేలా సినిమా తీశారంటూ రాజ్‌పుత్‌లు చిత్రయూనిట్‌ దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ సైతం ఈ సినిమాకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ)కి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. భన్సాలీ తెరకెక్కించిన ఈ చారిత్రక సినిమా విడుదలను వాయిదా వేయాలని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ అధికారి ప్రతినిధి ఐకే జడ్డేజా తెలిపారు. 

క్షత్రియ సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా ఉందని ఆరోపణలు వస్తున్నాయని, రాణి పద్మావతికి, దురాక్రమణకు దిగిన సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీకి మధ్య లింక్స్‌ ఉన్నట్టు ఈ సినిమాలో చరిత్ర వక్రీకరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఈ వివాదం పరిష్కారం అయ్యేవరకు సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని, సెన్సార్‌ బోర్డును కోరనున్నామని ఆయన చెప్పారు.

భన్సాలీ కళాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే విశేషమైన ఆదరణ లభించింది. డిసెంబర్‌ 1న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు