అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!: డా ప్రసాద్‌ తోటకూర

7 Sep, 2023 12:39 IST|Sakshi

అంతర్జాతీయ సంబంధాల కేంద్రం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,తిరుపతి వారు తానా పూర్వాధ్యక్షులు డా ప్రసాద్ తోటకూర గారితో విద్యార్థినుల ముఖాముఖి కార్యక్రమాన్ని సావేరి సెమినార్ హాల్ లో 2023 సెప్టెంబర్ 4న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య దేపూరు భారతిగారు విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ తానా సంస్థ ముఖ్య లక్ష్యాన్ని, వారు నిర్వహిస్తున్న కార్యకలాపాలను కొనియాడారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సంగీత, నృత్య విభాగం వాళ్ళు అధునాతన డిప్లొమా కోర్సులను నడుపుతున్నారని తెలియజేశారు.

పదుల సంఖ్యల్లో నుంచి వందల సంఖ్యల్లోకి అడ్మిషన్లు పెరిగాయని తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణను డా ప్రసాద్ తోటకూర గారి ముందుంచారు. గౌరవ అతిథి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య నల్లనాగుల రజినీగారు మాట్లాడుతూ అమెరికా నుంచి డా ప్రసాద్ గారు మన విశ్వవిద్యాలయానికి రావడం సంతోషదాయకం అన్నారు. కార్యనిర్వాహకులు అంతర్జాతీయ సంబంధాల కేంద్రం డీన్ ఆచార్య పి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని, కోర్సులు ప్రారంభంకావడానికి నాంది పలికిన వారు పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా తోటకూర ప్రసాద్ గారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన డా ప్రసాద్ తోటకూర గారు మాట్లాడుతూ.. అగ్రరాజ్యం అమెరికాలో ఉండే ఉద్యోగ అవకాశాల్ని, అక్కడి జీవన విధానాన్ని వివరించారు. అమెరికా గురించి చాలామంది విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తెలుగు భాషకు అక్కడున్న స్థాయిని, స్థానాన్ని తానా సంస్థ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. సత్య నాదెండ్ల, సుందర్ పిచాయ్, ఇంద్రనూయి కార్పోరేట్ దిగ్గజాలుగా ఎదిగిన ప్రస్తానాన్ని, పారిశ్రామిక దిగ్గజాలు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటివారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు.

సిరివెన్నెల కుటుంబ సభ్యులతో కలిసి తానా ప్రపంచ సాహిత్య వేదిక "సిరివెన్నెల సీతారామశాస్త్రి" గారు సృష్టించిన సాహిత్యం మొత్తాన్ని ఆరు సంపుటాల్లో ముద్రించిన గ్రంథాలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గ్రంథాలయనికి ప్రసాద్ గారు బహూకరించారు. ఈ కార్యక్రమానికి డా. హిమబిందు ఆహ్వానం పలుకగా, డా. యువశ్రీ వందన సమర్పణ చేశారు. డా శిరీష ప్రార్థనా గీతాన్ని ఆలపించారు.

అంతర్జాతీయ సంబంధాల కేంద్రం ఆచార్యులు, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థినులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం డా ప్రసాద్ తోటకూర గారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 2016వ సంవత్సరంలో కానుకగా బహూకరించిన మహాత్మా గాంధీ విగ్రహానికి ఆచార్యదేపూరు భారతి గారు, ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా ప్రసాద్ తోటకూర గారు, ఆచార్య పి విజయలక్ష్మి గారు పుష్పాంజలి ఘటించారు.

(చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్‌ పేరు!)

మరిన్ని వార్తలు