యోగిపై కాంగ్రెస్‌ వ్యాఖ్యలకు బీజేపీ నిరసన

15 Apr, 2018 13:06 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ దినేష్‌ గుండూరావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర రాజధాని బెంగుళూర్‌లో బీజేపీ ఆందోళన చేపట్టింది. భారత రాజకీయాలకు ఆదిత్యానాథ్‌ కళంకం తీసుకువచ్చారని గుండూరావు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు ఆక్షేపించారు. గుండూరావు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని బీజేపీ కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్‌ రవికుమార్‌ తెలిపారు.

ఉన్నావ్‌ లైంగిక దాడి, కస్టడీలో బాధితురాలి తండ్రి మృతి ఘటనలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేత గుండూరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఏమాత్రం విచక్షణ ఉన్నా తక్షణమే తన పదవికి రాజీనామా చేసేవారని అన్నారు. మరోవైపు ఉన్నావ్‌ లైంగిక దాడి కేసులో వాస్తవ ముద్దాయి సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. యూపీ సీఎంగా ఆయన తప్పుకోవాలని డిమాండ్‌ చేసింది. అలహాబాద్‌ హైకోర్టు యూపీ సర్కార్‌ను తప్పుపట్టిన క్రమంలో యోగి సీఎంగా కొనసాగేందుకు అర్హత కోల్పోయారని పేర్కొంది.  

>
మరిన్ని వార్తలు