బెంగాల్‌లో చల్లారని మంటలు..!

17 May, 2019 09:54 IST|Sakshi

బీజేపీ నేతలపై దాడి.. కార్ల ధ్వంసం

కోల్‌కత్తా: ప్రచారం ముగిసినప్పటికీ బెంగాల్‌లో పలుచోట్ల హింస కొనసాగుతూనే ఉంది. అమిత్‌ షా ర్యాలీతో మొదలైన దాడులు ఇంకా ఆగలేదు. తాజాగా బీజేపీ సీనియర్‌ నేత ముకుల్‌ రాయ్‌ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. గురువారం రాత్రి పదిగంటల సమయంలో స్థానిక నేతలతో సమావేశం నిమిత్తం డమ్‌డమ్‌ వెళ్లిన ముకుల్‌ రాయ్.. కారు అద్ధాలను పగలగొట్టారు. మరోఘటనలో బీజేపీ డమ్‌డమ్‌ ఎంపీ అభ్యర్థి సామిక్‌ భట్టాచార్యపై కూడా కొందరు వ్యక్తుల దాడికి పాల్పడ్డారు. 24 పరగనాల జిల్లాలోని నగీర్‌బజార్‌లో మొదట ఆయనపై దాడి చేసి అనంతరం కారును ధ్వసం చేశారు. ఈరెండు ఘటనలు టీఎంసీ కార్యకర్తలు చేశారని భట్టాచార్య ఆరోపిస్తున్నారు.

తనపై దాడి చేసిన ఘటన స్థానిక సీసీ కెమెరాలో రికార్డయిందని, దాడి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గురువారమే ప్రచారాన్ని ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్‌ జరగనుంది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియాల్సి ఉండగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో దానిని పశ్చిమ బెంగాల్‌లో మాత్రం గురువారం రాత్రికి కుదిస్తూ ఈసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు