కేసీఆర్‌కు రాంమాధవ్‌ సూటిప్రశ్న..!

25 Mar, 2019 14:36 IST|Sakshi

‘కింగ్‌ మేకర్‌’ ఎందుకు పోటీచేయడం లేదు : రాంమాధవ్‌

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ఎంపీ సీట్లను గెలిచి కేంద్రంలో కింగ్‌ మేకర్‌ అవుతానంటూ పదేపదే చెప్తున్న సీఎం కేసీఆర్‌ లోక్‌సభకు ఎందుకు పోటీచేయడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సూటిగా ప్రశ్నించారు. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ రాజకీయాలతో ప్రంట్‌లు ఏర్పడవని వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు గెలవడం అసాధ్యమని, ఆయన అతి తెలివితేటలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనను తలదన్నేలా కేసీఆర్‌ పాలన ఉందని విమర్శించారు. ప్రతిపక్షాల మనుగడను దెబ్బతీస్తున్నారని, అవినీతి అహంకార పాలన సాగుతోందని మండిపడ్డారు. సొంత బంధువుకు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వచ్చిందనే అక్కసుతో ఆయన ఉనికిని దెబ్బ తీస్తున్నారని, ఎంపీ జితేందర్‌రెడ్డి ఎదుగుదలను కట్టడి చేయడానికి టికెట్‌ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని, నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని అవుతారని మాధవ్‌ జోస్యం చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు