గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

6 Jun, 2019 19:54 IST|Sakshi

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి ఓడిపోతారని, సంపన్నులను మాత్రమే ఆయన పట్టించుకుంటున్నారు..కానీ నిజమైన బీజేపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఇద్దరు బీజేపీ నేతలు ఫోన్‌లో చేసిన సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఫోన్‌ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటంతో నాగ్‌పూర్‌ నగరానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. గడ్కరీని ఓడిపోతారంటూ.. ఆయన దూషించినందుకు ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. 

నాగ్‌పూర్‌ సిటీ బీజేపీ శాఖ వైస్‌ ప్రెసిడెంట్‌ జైహరి సింగ్‌ ఠాకూర్‌, సిటీ శాఖ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు అభయ్‌ టిడ్కా లోక్‌సభ ఎన్నికల ఫలితాల ముందు సెల్‌ఫోన్‌లో మాట్లాడిన ఆడియో క్లిప్‌ ఇది. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి గడ్కరీ లక్షా97వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

కాంగ్రెస్‌ అభ్యర్థి నానా పటోల్‌ చేతిలో గడ్కరీ ఓడిపోతారని, దీంతో నాగ్‌పూర్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే సుధాకర్‌ దేశ్‌ముఖ్‌ 2024 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఆయన స్థానం నుంచి కాంగ్రెస్‌ సిటీ అధ్యక్షుడు వికాస్‌ ఠాక్రే బీజేపీ టికెట్‌ మీద పోటీ చేస్తారని ఠాకూర్‌, టిడ్కా ఫోన్‌లో సంభాషించుకున్నారు. దీంతో ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా.. సంజయ్‌గాంధీ నిరాధార్‌ యోజన్‌ చైర్మన్‌గా ఉన్న ఠాకూర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అయితే, తనకు గడ్కరీ అంటే గౌరవముందని, తమ సంభాషణ ఆడియో క్లిప్‌ను ఎవరో ట్యాంపర్‌చేశారని ఠాకూర్‌ ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు