కాంగ్రెస్‌ టికెట్‌పై బీజేపీ ఎంపీ పోటీ..!

20 Mar, 2019 18:02 IST|Sakshi

పట్నా: బీజేపీ రెబ‌ల్‌ ఎంపీ ఎంపీ శ‌తృఘ్న సిన్హా.. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా బీజేపీ అధిష్టానంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ టికెట్‌ను నిరాకరించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయనకు టికెట్‌ దక్కకపోతే కాంగ్రెస్‌ నుంచి పోటీలో దిగాలని ఆయన భావిస్తున్నారు. బిహార్‌కు చెందిన శ‌తృఘ్న‌.. పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

మోదీపై శ‌తృఘ్న ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ఇ‍ప్పటికీ ఆయనపై బీజేపీ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. 2009, 2014 ఎన్నికల్లో పాట్నా సాహిబ్ స్థానం నుంచి శ‌తృఘ్న గెలిచారు. ఈసారి కూడా ఇదే స్థానం నుంచి పోటీచేయ‌నున్న‌ట్లు ఇదివరకే ప్రకటించారు. కానీ ఏ పార్టీ నుంచి పోటీచేస్తారనేది ఇంకా స్పష్టంకాలేదు. అయితే ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం నుంచి కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను బరిలో నిలపాలని బీజేపీ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తుకూడా ప్రారంభించింది. 
 

మరిన్ని వార్తలు