స్పీకర్‌ పదవికి బీజేపీ నామినేషన్‌ ఉపసంహరణ

1 Dec, 2019 11:40 IST|Sakshi

మహారాష్ట్ర స్పీకర్‌గా నానా పటోలే ఏకగ్రీవం

ముంబై: మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పదవికి బీజేపీ అభ్యర్థి కిషన్‌ కథోర్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా కథోర్‌ను నామినేట్‌ చేశామని.. అయితే స్పీకర్‌ ఎన్నికలో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకూడదనే సంప్రదాయాన్ని పాటిస్తూ తమ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చెప్పారు. అధికార పార్టీ సభ్యులు తమను పోటీ నుంచి విరమించుకోవాలని, స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించాలని కోరారని ఆయన అన్నారు. దీనిపై తాము సానుకూలంగా స్పందించామని ఆయన చెప్పారు. దీంతో ఈ ఉదయం సమావేశమైన అసెంబ్లీలో, ప్రోటెమ్ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్, నానా పటోలే ఎన్నిక ఏకగ్రీవమైందని ప్రకటించారు. కాగా.. విదర్భ ప్రాంతం నుంచి వచ్చిన నానా పటోలే, మోదీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన తొలి నేతల్లో ఒకరు. ఆయన కాంగ్రెస్ లో చేరి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై పోటీ చేసి ఓడిపోయారు. ఆపై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి, ఇప్పుడు స్పీకర్ గా మారారు.

చదవండి: తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడం నేరమా: ఉద్ధవ్‌

రాజ్యాంగ ఉల్లంఘనే: బీజేపీ
అంతకుముందు అసెంబ్లీలో సంభవించిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన కాళిదాస్‌ కొలాంబ్కర్‌ స్థానంలో ఎన్సీపీ నేత దిలీప్‌ వల్సే పాటిల్‌ను నియమించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ అభ్యంతరం తెలిపారు.

అసెంబ్లీలో బలాబలాలు..
మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యుల్లో అతిపెద్ద పార్టీ బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యుల బలముంది. నవంబర్‌ 28వ తేదీన శివాజీ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎంగా ఉద్ధవ్, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

చదవండి: మహా బలపరీక్ష: అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్‌

మరిన్ని వార్తలు