సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు, నాకు మధ్య గొడవలు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నించారని విమర్శించారు. హైదరాబాద్లో శనివారం జరిగిన టీటీడీపీ సమావేశంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో కృషి చేసి నేషనల్ ఫ్రంట్ను స్థాపించింది తానేని గుర్తుచేశారు. బ్యాంకుల్లో జరిగిన అవినీతితో బ్యాంకులపై విశ్వాసం పోయిందని వ్యాఖ్యానించారు.
మోదీ పాలనలో రూపాయి విలువ పడిపోయిందని.. పెట్రోల్ ధరలు పెంచారని చంద్రబాబు మండిపడ్డారు. పెట్రోల్ ధరలను ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలని బీజేపీని నిలదీశారు. ప్రత్యర్థులను అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. సీబీఐ, ఈడీ, ఐటీని అడ్డుపెట్టుకుని కేంద్రం బెదిరిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో సిద్ధాంతపరంగా పోరాడుతామన్న చంద్రబాబు.. బ్లాక్మని తెచ్చి ప్రజలకు పంచుతామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు.