కూటమి తరఫున ప్రచారం: చెరుకు సుధాకర్‌

20 Nov, 2018 02:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాము మహాకూటమికి వ్యతిరేకం కాదని, త్వరలోనే మహాకూటమి తరఫున ప్రచారం చేస్తామని తెలంగాణ ఇంటి పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పిన సోషల్‌ ఇంజనీరింగ్‌ అమలు జరగటం లేదన్నదే తమ ఆవేదన అని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలనే కూటమి ప్రతిపాదన పెట్టామని పేర్కొన్నారు.

చాలామంది పోటీపడ్డా.. ఆర్‌.కృష్ణయ్యకు మిర్యాలగూడ టికెట్‌ ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. అదే చొరవ తమ విషయంలోనూ చూపించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహాకూటమిలో జరిగిన పరిణా మాలపై తాము తెలిపిన నిరసన ఉత్తమ్‌ మీదనో మరెవరి మీదనో కాదని వివరణ ఇచ్చారు. కృష్ణయ్య, కాసాని జ్ఞానేశ్వర్‌ని కూటమిలో చేర్చుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నానని, ఆరోగ్యం మెరుగయ్యాక కూటమి తరుఫున ప్రచారం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు