చరిత్రలో నిలిచేలా పాదయాత్ర

24 Jan, 2018 07:16 IST|Sakshi

చంద్రగిరి ప్రాధాన్యం∙మరవలేనిది

నియోజకవర్గంలో 43 కిలోమీటర్లు..ఏడు రోజులు...

సంక్రాంతికి అభిమాన నాయకుడి కుటుంబం ఉండటం మరవలేనిది

విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు

వైఎస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తిరుపతి రూరల్‌: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత మరవలేనిదని వైఎస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏడు రోజులు పాటు 43 కిలోమీటర్ల మేర చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచేలా సాగిందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని, కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించేలా సాగిన జననేత జగనన్న పాదయాత్రను వేలాదిగా తరలివచ్చిన రైతులు, మహిళలు, యువకులు, శ్రామికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు.

తుమ్మలగుంటలోని స్వగృహంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకుడు చిన్నియాదవ్‌తో కలిసి ఆయన∙విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అద్భుతంగా సాగిన జగనన్న పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు రోజులు పాటు అభిమాన నాయకుడు ఉండటం మరవలేనిదన్నారు. నియోజవర్గంలో 43 కిలో మీటర్ల మేర జగనన్న పాదయాత్ర సాగిందన్నారు. సైనికుల వంటి పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి  కృషితో 43 కిలోమీటర్లు పార్టీ తోరణాలతో పందిళ్లు వేయడం, జెండాలు కట్టడం, మైక్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 70 టన్నుల పూలతో జననేతకు నియోజకవర్గ ప్రజలు పూలబాట వేశారని గుర్తు చేశారు. దామలచెరువు, అనుప్పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు వేలాదిగా తరలివచ్చి అలుపెరగని ప్రజా పోరాటయోధుడు జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలిపిన తీరు ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు.

మధురానుభూతిగా....సంక్రాంతి సంబరాలు
నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు ఆత్మీయ నాయకుడు జగనన్న సతీమణి భారతమ్మ రావడం, జగనన్న సామాన్యుల మధ్య సంబరాలను చేసుకోవడం నియోజకవర్గంలోని అందరి హృదయాల్లో మధురానుభూతిగా నిలిచిందన్నారు. రికార్డు స్థాయిలో ఏడు రోజుల పాటు సాగిన ప్ర జా సంకల్పయాత్రను విజయవంతం చేయడంలో సహకరించిన నాయకులు, కార్యకర్తలు, కళాకారులు, పాదయాత్రగా వచ్చిన వారికి వైద్యసేవలు అందించిన వైద్య బృందానికి, స్వచ్ఛందంగా 16 టీమ్‌ల ద్వారా సేవలు అం దించిన నాయకులకు భాస్కర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు