‘గంజికి గతిలేనోళ్లు.. బెంజీ కార్లలో తిరుగుతున్నారు’

2 Nov, 2019 16:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్టణం : చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హడావుడి చేస్తున్నారని చోడవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. జనసేన రేపు (ఆదివారం) విశాఖలో తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ కార్యక్రమం నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నీ ఎన్నికల ఖర్చు కోసం చంద్రబాబు వద్ద వంద కోట్లు తీసుకుంది నిజం కాదా?

ఆ డబ్బుతోనే నీవు భీమవరం, గాజువాకల్లో పోటీ చేయలేదా? ఇప్పుడు ఇసుక పేరుతో డ్రామాలాడుతున్నావు. గత ఐదేళ్లలో టీడీపీ నేతల దోపిడీ గురించి ఎందుకు లాంగ్‌మార్చ్‌ చేయలేదు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో అమాయకులు చనిపోతే లాంగ్‌మార్చ్‌ ఎందుకు చేయలేదు? చింతమనేని వనజాక్షిపై దాడి చేసినప్పుడు, కాల్‌ మనీ కేసులో ఆడవాళ్ల శీలం దోచుకున్నప్పుడు ఎందుకు లాంగ్‌ మార్చ్‌ చేయలేదు’అని ఎమెల్యే పవన్‌ను సూటిగా ప్రశ్నించారు.

‘గంజికి కూడా గతిలేని కొందరు టీడీపీ నాయకులు ఇసుక దోపిడీతో నేడు బెంజీ కార్లలో తిరుగుతున్నారు. వర్షాల వల్ల ఇసుక తవ్వలేని పరిస్థితులు తలెత్తితే మీకు కనపడటం లేదా? ఇసుక అక్రమ రవాణా అంటున్నారు, ఎక్కడ జరుగుతుందో నిరూపించాలి. చంద్రబాబు డైరెక్షన్‌లో నువ్‌ నటిస్తున్నావు. నీ వృత్తి అదే కదా. మీ మధ్య ఒప్పందాన్ని బయటపెట్టాలి. అందరినీ మోసం చేసిన చంద్రబాబును నువ్వు ఎలా నమ్ముతున్నావో అర్థం కావడం లేదు. సొంత పుత్రుడు పనికిరాడనే దత్తపుత్రుడివైన నిన్ను చంద్రబాబు ఉసిగొల్పుతున్నాడు. ఎక్కడినుంచో వచ్చి విశాఖ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడి ప్రజలు అమాయకులు కారు’ అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు