నియోజకవర్గ స్థాయి సమావేశం రసాభాస
అనిరుధ్రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన
జడ్చర్ల: కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో గలాటా చోటు చేసుకుంది. లోక్సభ ఎంపీ అభ్యర్థి విజయం కోసం ఏర్పాటుచేసిన సమావేశం రసాబాసగా మారింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసుకోవడంతోపాటు దూషించుకున్నారు. కుర్చీలు గాల్లోకి లేపారు. సంఘటనకు సంబంధించి వివరాలిలా.. మంగళవారం స్థానిక మల్లు రవి నివాసంలో ఇటీవల నియోజకవర్గ కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించిన అనిరుధ్రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
పార్టీ అభ్యర్థి విజయానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఎంపీటీసీ సభ్యుడు బాలవర్ధన్గౌడ్, బాదేపల్లికి చెందిన ఖయ్యూం, విజయ్, నర్సింహయాదవ్ తదితరులు ఒక్కసారిగా అనిరుధ్రెడ్డిపై ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తు ఆందోళనకు దిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి విజయానికి ఎంతమాత్రం అనిరుధ్రెడ్డి కృషి చేయలేదని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులను ఓడించేందుకు ప్రత్యర్థి అభ్యర్థులకు సాయం అందించాడని అరోపించారు.
ఇటువంటి వ్యక్తికి నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. అందరు నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కొందరు సీనియర్ నాయకులు కార్యకర్తలను శాంతపరిచి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీలు నిత్యానందం, బూర్ల వెంకటయ్య, నాయకులు అశోక్యాదవ్, సర్ఫరాజ్, మాజీ సర్పంచ్ రేణుక తదితరులు పాల్గొన్నారు.