రేణుక ద్రౌపదిగా.. మోదీ, షాలు కౌరవులుగా..

10 Feb, 2018 18:47 IST|Sakshi
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకుడు కట్టిన పోస్టర్‌

అలహాబాద్‌, ఉత్తరప్రదేశ్‌ : రాజ్యసభలో ప్రసంగిస్తున్న సమయంలో పెద్దగా నవ్వుతూ పదే పదే అడ్డుపడిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేణుకా చౌదరిని రామాయణంలోని ఓ క్యారెక్టర్‌తో పోల్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తాజాగా ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు హసీబ్‌ అహ్మద్‌.. రేణుకను మహాభారతంలోని ద్రౌపదితో పోల్చుతూ పోస్టర్‌ వేశారు.

రేణుకపై మోదీ రాజ్యసభలో చేసిన కామెంట్‌కు దేశంలోని మహిళలందరికీ ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన వ్యక్తుల్లో హసీబ్‌ అహ్మద్‌ కూడా ఒకరు. పోస్టర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజులను కౌరవులుగా చిత్రీకరించారు.

బీజేపీ కురువృద్దుడు ఎల్‌కే అద్వాణీని అంధరాజు ధృతరాష్ట్రుడిగా, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని శ్రీకృష్ణుడి పాత్రలో ఉన్నారు. రక్షామ్‌ రాహుల్‌ గాంధీ( రాహుల్‌ గాంధీ రక్షించండి) అనే పదాన్ని కూడా పోస్టర్‌పై ఉంచారు. ‘ఓ మహిళ నవ్విందని దుర్యోధనుడు అహంకారంతో చేసిన పనికి 101 మంది కౌరవులు మరణించారన్నది మర్చిపోకండి’  అనే ట్యాగ్‌ లైన్‌ను కూడా పోస్టర్‌లో ఉంచారు.

ఓ వైపు బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాలను చేస్తున్న మోదీ.. ఓ మహిళా ఎంపీ నవ్వును అవహేళన చేయడంపై హసీబ​అహ్మద్‌ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు