రాజస్తాన్‌ రిసార్ట్‌కు గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 

8 Jun, 2020 07:45 IST|Sakshi

జైపూర్ ‌: గుజరాత్‌లోని తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం రాజస్తాన్‌లోని ఒక రిసార్ట్‌కు తరలించింది. జూన్‌ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించింది. 182 మంది సభ్యుల గుజరాత్‌ అసెంబ్లీలో.. పలువురు సభ్యుల రాజీనామా అనంతరం ప్రస్తుతం కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ గుజరాత్‌లోని రాజ్‌కోట్, అంబాజీ, ఆనంద్‌ల్లో ఉన్న రిసార్ట్‌లకు తరలించింది. రాజ్‌కోట్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్న నీల్‌సిటీ రిసార్ట్‌పై లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసు కేసు నమోదైంది. ‘ప్రస్తుతం రాజస్తాన్‌లోని అబు రోడ్‌లో ఉన్న రిసార్ట్‌లో 21 మంది మా ఎమ్మెల్యేలున్నారు. ఉత్తర గుజరాత్‌ నుంచి మరి కొందరు సోమవారం వస్తారు’ అని కాంగ్రెస్‌ నేత ఒకరు వెల్లడించారు. కరోనాతో పోరాడాల్సిన సమయంలో మా ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో బీజేపీ బిజీగా ఉంది అని గుజరాత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమిత్‌ చావ్‌డా విమర్శించారు.

మరిన్ని వార్తలు