సాక్షి, హైదరాబాద్: తొమ్మిది నెలల సమయం ఉన్నా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన కష్టం ఏమొచ్చిందో కేసీఆర్ చెప్పాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. గురువారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన పరేషాన్ ఏందో చెబితే బాగుండేదన్నారు. ఆయన కుమారుడో, మంత్రులో కేసీఆర్ను పదవి నుంచి దిగిపొమ్మని చెప్పి ఉంటారని, అందుకే ఆగమేఘాల మీద అసెంబ్లీని రద్దు చేశారన్నారు.
దొరల పాలన, గడీల పాలనకు విముక్తి కలిగినందుకు రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకుంటారన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందన్నారు. సర్వేల్లో 100 సీట్లు వస్తాయని తెలిసినా ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకున్నారని, దేశంలో అత్యధిక జూటా మాటలు చెప్పే వ్యక్తి కేసీఆర్ అని, అంతకు మించి పెద్ద బఫూన్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.