‘శివస్వామిని విమర్శించే స్థాయి మహేష్‌కు లేదు’

6 Jun, 2020 19:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌పై జనసేన నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, వైఎస్సార్‌సీపీ నేత కొనకళ్ల విద్యాధరరావు అన్నారు. దేవాలయాలు పునర్నిర్మాణం చేయలేదన్న మహేష్ వ్యాఖ్యల్లో అర్థం లేదని తోసిపుచ్చారు. టీడీపీ ప్రభుత్వం పుష్కరాలను అడ్డు పెట్టుకుని అనేక దోపిడీలకు పాల్పడిందని విమర్శించారు.  టీడీపీ హయాంలో దేవాలయాలు కూల్చివేస్తుంటే బాబుతో దోస్తీ చేసిన పవన్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పులను ఈ ప్రభుత్వం సరిచేస్తోందని హితవు పలికారు. 

పైలా సోమినాయుడు, కొనకళ్ల విద్యాధరరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జిల్లాలోని దేవాలయాలకు ఏడాది కాలంలో రూ.15 కోట్లు ఇచ్చిన ఘనత వెలంపల్లికే దక్కుతుంది. అవగాన లేకుండా పోతిన మహేష్ మాట్లాడడం తగదు. శివస్వామిని విమర్శించే స్థాయి మహేష్ కు లేదు. కరోనా‌ సమయంలో ప్రజలందరికీ కూరగాయలు,‌ నిత్యావసరాలు పంపిణీ చేసిన వ్యక్తి వెలంపల్లి. వైఎస్సార్‌సీపీ నేతల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని అసత్య ప్రేలాపనలు చేస్తున్నారు. గత టీడీపీ హయాంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆధారాలుంటే విమర్శలు చేయాలి తప్ప అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు’అని వారు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు