పెళ్లికి రండి.. ఎన్నికల ఫలితాలు చూడండి

22 May, 2019 06:51 IST|Sakshi
వివాహ ముహూర్తపు కార్డు

ఓ జగన్‌ అభిమాని పెళ్లి పిలుపు

గుత్తికొండ (పిడుగురాళ్ల రూరల్‌): తన పెళ్లి చిరకాలం గుర్తుండిపోవాలని భావించిన ఓ యువకుడు ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆరోజు తమ అభిమాన నాయకుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపొందబోయే రోజు అని, ఆరోజు అయితే ఈ జన్మలో మరచిపోలేని తీపి జ్ఞాపకంగా ఉండిపోతుందని భావించి అదేరోజు వివాహం ఖరారు చేసుకున్నాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన చినసుబ్బారావు, రావమ్మల కుమారుడు రామకోటయ్యకు మాదల గ్రామానికి చెందిన మాదగిరి శ్రీనివాసరావు, తులసి దంపతుల కుమార్తె వెనీలాతో 23న వివాహం నిశ్చయించారు.

అదేరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో వివాహ వేడుకలో టీవీలు ఏర్పాటుచేసి ఫలితాలు అందరికీ కనిపించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అదే విషయాన్ని బంధువులకు పెళ్లి కార్డులు ఇస్తూ కుటుంబసభ్యులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పెళ్లికి రండి.. ఎన్నికల ఫలితాలు కూడా అక్కడే టీవీల్లో చూసేలా ఏర్పాటు చేస్తున్నాం.. అంటూ చెబుతున్నారు. దీంతో  పెళ్లికి వెళ్లినట్లు ఉంటుంది. ఫలితాలు చూసినట్లు ఉంటుందని భావించిన బంధువులు తప్పకుండా పెళ్లికి వస్తామని చెబుతున్నట్లు పెళ్లికొడుకు తండ్రి చిన సుబ్బారావు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు