సాక్షి, విజయవాడ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై జరిగిన పోలీసులు దాడులు బూటకమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. సీఎం రమేష్ కావాలనే పోలీసులతో తన ఇంటిపై దాడులు జరిపించుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల దినపత్రిక బట్టబయలు చేసిందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా డ్రామాలు ఆడిన సీఎం రమేష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో సానుభూతి కోసమే టీడీపీ నేతలు పోలీసుల దాడులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. డ్రామాలు ఆడడం సీఎం రమేష్కు, టీడీపీ నేతలకు కొత్తేం కాదన్నారు. సీఎం రమేష్ డ్రామాలపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టడానికి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన టీడీపీకి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.