ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌.. ఎంపీగా బ్యాడ్‌లక్‌

21 Mar, 2019 11:37 IST|Sakshi

రాజేంద్రనగర్‌: శాసనసభకు మూడుసార్లు ఎన్నికై హ్యాట్రిక్‌ విజయం సాధించిన బీజేపీ నాయకుడు బద్దం బాల్‌రెడ్డి పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం విజయం అంచు వరకు వెళ్లి ఓటమి పాలయ్యారు. ‘గోల్కొండ సింహం’గా అభిమానులు పిలుచుకునే ఈయన తుది శ్వాస వరకు ఎన్నికల్లో పోటీచేశారు. బద్దం బాల్‌రెడ్డి నగరంలోని కార్వాన్‌ నియోజకవర్గం నుంచి 1985లో ఎంఐఎం అభ్యర్థి రసూల్‌ఖాన్‌పై 9,777 ఓట్లతో, 1989లో ఎంఐఎం అభ్యర్థి ఆగాపై 30,066, 1994లో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్‌ సజ్జద్‌పై 13,293 ఓట్లతో విజయం సాధించారు.

వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌ వీరుడిగా పేరొందారు. కానీ, పార్లమెంట్‌లో కాలుమోపేందుకు శతవిధాలా ప్రయత్నించినా విజయం సాధించలేదు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఈయన 1991లో 39,524 ఓట్లతో ఓటమి పాలయ్యారు. 1998, 1999 ఎన్నికల్లో సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీపై పోటీ చేసి పరాజయం పొందారు. 2009లో చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసి విజయం కోసం తుదివరకు ప్రయత్నించారు. కాగా, తన చివరి దశలో 2018 డిసెంబర్‌లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

మరిన్ని వార్తలు