సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మట్టంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక ఫలితాన్ని అక్టోబరు 24న ప్రకటిస్తారు.
హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా
పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు సమాచారం. సాయంత్రం 5 గంటల్లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటువేసే అవకాశం కల్పించనున్నారు.
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 75 శాతం పోలింగ్ నమోదైంది. 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. కాగా, పోలింగ్ ముగిసేందుకు సమయం దగ్గరపడుతుంటడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మొరాయించిన ఈవీఎంలు..
నేరేడుచర్ల మండలంలోని చింతబండలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ను నిలిపివేసి... అధికారులు ఈవీఎంలను సరిచేస్తున్నారు. మరోవైపు చింతకుంట్లలోని పోలింగ్ కేంద్రంలో వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ గుర్తులు గుర్తించడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.
కాగా హుజూర్నగర్ శాసనసభ స్థానానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన భార్య పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ కోటా రామారావుకు బీఫాం ఇచ్చి బరిలో నిలిపింది. ఇక ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక కేసీఆర్ సర్కారుకు సవాలుగా మారింది. కార్మికులను పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణి అనుసరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎన్నిక ఫలితాలను రిఫరెండంగా తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉప ఎన్నికపోరు రసవత్తరంగా మారింది.
పోలీస్ పహారాలో..
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. మొత్తం 2,350 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చేస్తున్నారు. 6 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, జోన్ పరిధిలోని జిల్లాల నుంచి అదనపు సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్స్, టాస్క్ఫోర్స్, 27 రూట్ మొబైల్స్, 7 క్విక్ రియాక్షన్ టీమ్స్ బందోబస్తులో ఉన్నాయి.