సాక్షి, న్యూఢిల్లీ: సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు గట్టి మద్దతు తెలిపారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని రుజువు చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తన స్పందనను ట్విటర్ ద్వారా వెల్లడించారు.
కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని, వారి వల్లే ఘనవిజయం సాధించామన్నారు. బీజేపీపై నమ్మకం ఉంచిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీయిచ్చారు.
మరోవైపు తమ పార్టీని గెలిచిపించిన గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ప్రజలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు.